రామచంద్రాపురం, మార్చి 11: అభివృద్ధి, సంక్షేమం విషయంలో బీఆర్ఎస్కు ఏదీ సాటి రాదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్లో ఇటీవల గ్రామ అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించిన మూడు ఎకరాల స్థలంలో రూ.8.40 కోట్లతో నిర్మించనున్న మున్సిపల్ కార్యాలయ భవనం, రూ.7 కోట్లతో ఫంక్షన్హాల్, రూ.10 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్, రూ.3.90 కోట్లతో వెజ్అండ్నాన్వెజ్ మార్కెట్ పనులతో పాటు రూ.3.70 కోట్లతో చేపట్టనున్న డ్రైనేజీ లైన్ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, ప్రొటెం మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్యదక్షతతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో నంబర్వన్గా నిలిచిందన్నారు. ప్రపంచం చూపు ఇప్పుడు తెలంగాణ వైపు ఉన్నదని తెలిపారు.
అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. సంక్షేమ రంగంలో కూడా ఇతర రాష్ర్టాలతో పోల్చితే మనమే అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో జరిగిందన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రగల్భాలకే పరిమితం అవుతున్నారని, వారితో ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదన్నారు. ప్రజలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఒకేరోజు రూ.33 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకున్నామని, మున్సిపాలిటీ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.
అభివృద్ధికి పెద్దపీట..
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని ప్రొటెం మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి అన్నారు. దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి మనకు సీఎంగా ఉండటం మనం చేసుకున్న అదృష్టమని తెలిపారు. అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజలు స్వాగతించాలని ఆయన కోరారు.
– ప్రొటెం మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి
మాట ఇచ్చాం నిలబెట్టుకున్నాం..
తెల్లాపూర్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి అన్నారు. తెల్లాపూర్ గ్రామ అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు విలువ చేసే మూడు ఎకరాల భూమి కేటాయించడం చాలా సంతోషకరమని, ఆ భూమిలో మున్సిపల్ భవనం, విద్యుత్ సబ్స్టేషన్, ఫంక్షన్హాల్ని నిర్మించబోతున్నామన్నారు. మున్సిపల్ భవన నిర్మా ణం పూర్తయిన వెంటనే ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ప్రభుత్వ దవాఖానకు కేటాయిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు రూ.25 కోట్లు, మున్సిపల్ నిధులు కలిపి మొత్తం రూ.33 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకున్నట్లు వివరించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే, ప్రొటెం మాజీ చైర్మన్, చైర్పర్సన్ను భారీ గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్పానగేశ్, వైస్ చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్లు సుచరిత, మయూరి, మంజుల, పావని, సరిత, చిట్టి, జ్యోతి, శ్రీశైలం, లచ్చిరాం, నాగరాజు, బాబ్జీ, రాజు, రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దేవేందర్యాదవ్, ఆదర్శ్రెడ్డి, శ్రీపాల్రెడ్డి, మల్లారెడ్డి, బుచ్చిరెడ్డి, ఇంద్రారెడ్డి, సాగర్, సత్యనారాయణ, యాదగిరి, ఉమేశ్వర్, అజీమ్ తదితరులున్నారు.
– మున్సిపల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి