మెదక్ అర్బన్, జూన్ 16: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జిల్లాలు పునర్విభజన చేయడంతో ఉమ్మడి మెదక్ జిల్లా మూడు జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ప్రధాన కార్యాలయాలతోపాటు జిల్లా న్యాయస్థానం సైతం సంగారెడ్డిలో ఉండేది. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు సంగారెడ్డిలో ప్రధాన కార్యాలయాలు ఉండడంతో సిద్దిపేట, మెదక్ ప్రజలకు వ్యయప్రయాసలతో కూడుకొని ఉండేది. కానీ, తెలంగాణ ప్రభుత్వం సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలుగా ఏర్పాటు చేయడంతో ప్రధాన కార్యాలయాలన్నీ మెదక్లో ఏర్పాటయ్యాయి. జిల్లా న్యాయస్థానంతోపాటు జిల్లా అదనపు న్యాయస్థానాలూ ఏర్పాటు చేశారు. ప్రస్తుత కోర్టు భవనంలోని 3వ అంతస్తులో అదనపు గదుల నిర్మాణం కోసం హైకోర్టు రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఈ భవన నిర్మాణ పనుల శంకుస్థాపన కోసం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శనివారం జిల్లాకేంద్రానికి రానున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నవీన్రావు, అనుగు సంతోష్రెడ్డి కూడా విచ్చేయనున్నారు. శంకుస్థాపన అనంతరం వీరంతా మెదక్ చర్చి, ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని దర్శించుకోనున్నారు.
ఏర్పాట్లు చేయాలి: మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మెదక్ పట్టణానికి సీజేతోపాటు ఇతర హైకోరు ్టన్యాయమూర్తులు రానుండడంతో తగు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు జారీ చేశారు. వారి కోసం ఆర్అండ్బీ, ఫారెస్ట్ గెస్ట్హౌస్లలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం కలగకుండా జనరేటర్ సిద్ధంగా ఉంచాలని విద్యుత్ శాఖ డీఈకి కలెక్టర్ సూచించారు.
హైకోర్టు న్యాయమూర్తి సంతోష్రెడ్డికి మెదక్తో అనుబంధం…
హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్న అనుగు సంతోష్రెడ్డికి మెదక్తో అనుబంధం ఉంది. ఆయన 1985లో న్యాయవాదిగా హైకోర్టులో నమోదు చేసుకొని కరీంనగర్లో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 1991లో మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులై మొదటి పోస్టింగ్ మెదక్లోనే వచ్చింది. అనంతరం 2004లో సీనియర్ సివిల్ న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. 2010లో జిల్లా న్యాయమూర్తిగా ప్రమోషన్ పొంది ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సిద్దిపేట్ కోర్టులో అదనపు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ కార్యదర్శిగా సేవలందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా 2017 వరకు కొనసాగారు. అనంతరం రంగారెడ్డి జిల్లా అదనపు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించగా, ప్రమోషన్పై తెలంగాణ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రెటరీగా సేవలందించే అవకాశం వరించింది. 2018లో మరోసారి రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులై 2022, ఫిబ్రవరి 23 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం పొందిన సంతోష్రెడ్డి ప్రస్తుతం మెదక్ పోర్ట్ పోలియో న్యాయమూర్తిగానూ కొనసాగుతున్నారు.