చేగుంట, ఏప్రిల్ 24: అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్సీ ఫరూక్హుస్సేన్ అన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తరపున మెదక్లో నామినేషన్ వేసి చేగుంటకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గెలిచిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పి నాలుగు నెలలు గడుస్తున్నా ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా ఉందన్నారు. ఆగస్టు 15 వరకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తానని, ఐదువందల బోనస్ ఇస్తానని సీఎం రేవంత్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందన్నారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి పేదల సంక్షేమంపై అవగాహన ఉందని,ఎంపీ అయితే అనేక సేవా కార్యక్రమాలు చేస్తారనే నమ్మకంతో కేసీఆర్ టికెట్ కేటాయించారన్నారు. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో మైనార్టీ మండల నాయకుడు మహ్మద్అలీ, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు రబ్బాని, రహీమొద్దీన్, వల్లూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు వాహిద్, వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మీర్గియాస్వుద్దీన్, షాదుల్లా పాల్గొన్నారు.