పెద్దశంకరంపేట, మే 20: కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యాన్ని వెంటనే సేకరించాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మె ల్యే భూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని జూకల్, వీరోజిపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వెంట వెంటనే లారీలను రైస్ మిల్లులకు పంపించాలన్నారు.
రైతులు పడుతున్న ఇబ్బందులను ఫోన్లో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్కు వివరించడంతో పాటు కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని ఆయ న ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల నాయకుడు సురేశ్గౌడ్, సర్పంచ్ మన్నె కృష్ణ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.