గజ్వేల్, మార్చి 30: ప్రతి కార్యకర్త ఓపికతో ఉండాలని, ఆరు నెలల్లో మనకే భవిష్యత్ ఉంటుందని, కష్టకాలంలో పార్టీని వీడిన వాళ్లను కాళ్లు మొక్కినా తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. శనివారం గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం శామీర్పేటలోని అరణ్య అతిథి గృహంలో జరిగింది. ముఖ్య అతిథిగా హరీశ్రావు హాజరై మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు.
వంద రోజుల్లో ఏ ఒక్క హామీ సరిగ్గా అమలు చేయలేదని, కాంగ్రెస్ సర్కారు తీరుతో ఆర్టీసీ, సివిల్ సైప్లె కార్పొరేషన్లు దివాళా తీయడం ఖాయమన్నారు. వంద రోజులు గడిచినా పింఛన్ రూ.4వేలు, రైతుబంధు రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు రాలేదన్నారు. గ్రామాల్లో రైతులు బోర్లు వేసే పరిస్థితి వచ్చిందని, వ్యవసాయ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని తెలిపారు. నాడు తెలంగాణ వస్త్తదా అని అనుకున్నామా అదే విధంగా మళ్లీ మనం అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
మనకు నష్టం చేసిన వాళ్లను విడిచిపెట్టేది లేదని, లెక్కలు రాసుకుంటున్నామని, వడ్డీతో సహా తీర్చుకుంటామని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలో రూ.150 కోట్ల అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. అభివృద్ధ్దిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ సర్కారు ప్రజలను ఎలా ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే, వాటిని రద్దు చేసిన కాంగ్రెస్ సర్కారుకు బుద్ధిచెప్పాలన్నారు. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ పనులు చేసి పెట్టానని, కానీ.. కడుపునిండా మాట్లాడలేక పోయానన్నారు. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని హరీశ్రావు భరోసా ఇచ్చారు. పదేండ్లలో ఎవరినీ వేధించలేదని, ఎవరికీ అపకారం చేయలేదన్నారు.
గజ్వేల్ను పదేండ్ల కాలంలోనే 50ఏండ్ల అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని హరీశ్రావు అన్నారు. పంటలు ఎండిపోతే రాత్రి ఫోన్చేస్తే తెల్లారి కాలువ తెంపి కూడవెల్లిలోకి నీళ్లు విడుదల చేసిన విషయాన్ని హరీశ్రావు గుర్తుచేశారు. గజ్వేల్కు సాగు, తాగునీళ్లు తెచ్చుకున్నామని, జిల్లా దవాఖాన, మాతాశిశు కేంద్రం నిర్మించుకున్నట్లు తెలిపారు. వెంకట్రామిరెడ్డి మంచివ్యక్తి అని, అంద రూ కష్టపడి అతన్ని గెలుపించుకోవాలని క్యాడర్కు హరీశ్రావు పిలుపునిచ్చారు. రూ.100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తున్నాడని, అది మీ అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కష్టకాలంలో విభేదాలు మరిచి పనిచేయాలన్నారు.
గజ్వేల్ అభివృద్ధ్దిని చూసి ఓర్వలేని రఘునందన్రావుకు ఎందుకు ఓట్లు వేయాలని, గజ్వేల్ మీద కేసీఆర్కు ఉన్న ప్రేమ రఘునందన్కు ఉంటుందా అన్నారు. గజ్వేల్ అభివృద్ధ్దిని అడ్డుకునే ప్రయత్నం చేసిన రఘునందన్ గురించి గ్రామాల్లో చర్చ పెట్టాలన్నారు. నడిచే ఎద్దు అయితే అక్కడే నడుచు కదా… దుబ్బాకలో మోసం చేస్తే అతన్ని బండకేసి కొట్టారని హరీశ్రావు అన్నారు. సమావేశంలో మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, నాయకులు మాదాసు శ్రీనివాస్, అంజిరెడ్డి, కొట్టాల యాదగిరి, ప్రభాకర్రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఏసీఎస్ చైర్మన్లు, మండలపార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
తాను మీలో ఒకడినని, అందరూ తనకు అండగా ఉండాలని, ఈ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా కృషి చేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కోరారు. కేసీఆర్, హరీశ్రావు ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్గా తనకు అవకాశం కల్పించారని, తన పనితీరుకు పాస్ మార్కులు వేయడంతో సిద్దిపేట కలెక్టర్గా వచ్చానని, కలెక్టర్గా పనిచేసి గజ్వేల్ అభివృద్ధ్దిలో భాగస్వామ్యం అయిన విషయాన్ని గుర్తుచేశారు. దేశంలోనే అభివృద్ధ్దిలో టాప్-10లో సిద్దిపేట జిల్లా నిలవడం మనకు గర్వకారణమన్నారు.
కేసీఆర్ ‘గడా’ను ఏర్పాటు చేసి గజ్వేల్ను అభివృద్ధిని 50ఏండ్ల ముందుకు తీసుకెళ్లారన్నారు. మెదక్ సీటు ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసినా తాను తిరస్కరించానన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడున్నర ఏండ్ల పాటు పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. సమర్థుడిగా మాజీ సీఎంలు రాజశేఖర్రెడ్డి, కిరణ్కుమార్రెడ్డి, కేసీఆర్ల వద్ద పనిచేశానన్నారు. సమర్థత ఎక్కడ ఉంటుందో విజయం అక్కడే ఉంటుందన్నారు. రూ.100కోట్లతో పీవీఆర్ ట్రస్టు ఏర్పాటుచేసి సామాజిక కార్యక్రమాలు చేపడుతానని హామీ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్హాళ్లు నిర్మించి అందరికీ అందుబాటులోకి తెస్తానని తెలిపారు.
– మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి
పదవులు అనుభవించిన వారు పార్టీ మారుతున్నారని, కష్టకాలంలో పార్టీలో ఉండి పనిచేసే వారే గొప్పవారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గ్రూప్లు బంద్ చేసి పార్టీని కాపాడుకుందామన్నారు. కార్యకర్తలు కంకణబద్ధ్దులై పనిచేయాలని పిలుపునిచ్చారు. డిపాజిట్ రాని వ్యక్తి కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నాడని, గజ్వేల్ను కేసీఆర్ రూ.10వేల కోట్లతో అభివృద్ధి చేశారన్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టుతో పాటు గజ్వేల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
నర్సారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వర్గల్కు రోడ్డు కూడా వేసుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడునెలలు కాలేదని, పార్టీ కండువా వేసుకుంటేనే దందాలు చేసుకోవాలని ఆయన మాట్లాడుతున్నడన్నారు. నర్సారెడ్డి ప్రజల్లో ఎప్పుడైనా కనిపించిండా, తనపై 60కేసులు పెట్టించడన్నారు. ఎక్కడ అవినీతి జరిగినా అడ్డుకుంటామన్నారు. ప్రతి కార్యకర్త ధైర్యంతో పనిచేసి ఎన్నికల్లో సత్తాచాటాలన్నారు. కాంగ్రెస్ సర్కారు తీరుతో జిల్లాలోని ప్రాజెక్టుల్లో చుక్కనీళ్లు లేవన్నారు. వచ్చేనెల 2న గజ్వేల్లో కార్యకర్తల సమావేశం ఉంటుందన్నారు.
– ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి
మెదక్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం: ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిభారీ ఆధిక్యంతో వెంకట్రామిరెడ్డి గెలుపు ఖాయమని, అందుకు ప్రతి ఒక్కరూ మరింతగా కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్కు మంచి పట్టు ఉందని, కార్యకర్తలు కష్టపడి విజయానికి కృషి చేయాలన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధ్దితో తప్పకుండా మంచి మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.