సిద్దిపేట, ఏప్రిల్ 19: ధాన్యం సేకరణలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు వారికి అండగా నిలవాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వడ్లకు ప్రభుత్వం మద్దతు ధర రూ.2203 ప్రకటించినా, 15 రోజుల నుంచి ధాన్యం కొనడం లేదని విమర్శించారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడకపోవడంతో రైతులు వ్యాపారులకు తకువ ధరకు ధాన్యం అమ్ముకొని నష్టపోతున్నట్లు హరీశ్రావు తెలిపారు. వ్యాపారులకు రూ. 1800లకు క్వింటాల్ ధాన్యం అమ్ముకోవడంతో రైతు రూ. 400 నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 500 బోనస్ ఇవ్వకపోగా, రైతులకు 400 నష్టం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కారు తీరును హరీశ్రావు దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో చివరి గింజ వరకూ కొని మద్దతు ధర ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక హామీ అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ రైతు వ్యతిరేకులని, వారికి రైతు సంక్షేమం పట్టదని హరీశ్రావు విమర్శించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు రైతులకు ఎడ్లు, నాగలి ఇస్తా అని మోసం చేశాడని, దుబ్బాక ఎన్నికల్లో మోసం చేసిన రఘునందన్ను మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బండకేసి కొట్టారన్నారు. దుబ్బాకలో చెల్లని వ్యక్తి మెదక్లో ఎట్ల చెల్లుతాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు అయ్యేదాకా రైతుల పక్షాన పోరాటం చేయాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు హరీశ్రావు పిలుపునిచ్చారు. కల్లాల వద్దకు వెళ్లాలని, సీఎంకు పోస్ట్ కార్డు రాసి పంపాలన్నారు. ప్రతి గ్రామంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టి రైతులకు అండగా నిలవాలన్నారు. కొనుగులు కేంద్రాలు ప్రారంభమయ్యేలా రెవెన్యూ అధికారులను అడగాలని, లేనిపక్షంలో రైతులకు అండగా రాస్తారోకోలు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు హరీశ్రావు పిలుపునిచ్చారు.
ఇదివరకు జప్ప జప్ప వడ్లు కొందురు. ఇప్పుడు వారం రోజులు అయితాంది. వారం కిందట వడ్లు తెత్తే ఈడ ఆరబోద్దమంటే జాగలేదు. జాగ దొరికినంక మల్ల ఎండపోసినం. ఇప్పుడు వడ్లు అన్ని పట్టినంకనే మయ్చిర్ సూత్తమని సార్లు చెప్పుతుండ్రు. వొ దిక్కు మబ్బులు వత్తన్నయి. వానపడితనా ఒక్క ఇత్తుకూడ పనికిరాదు. దనదన కొనెతట్టు సూడుండ్రి సారు.