పెద్దశంకరంపేట, నవంబర్ 30: సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న వేధింపులు, లైంగిక దాడులు, బాల్యవివాహాలు, లింగ వివక్ష, ఆరోగ్య సమస్యలు వంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొనేలా సిద్ధపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో బాలికా సాధికారిత కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యాశాఖ, పోలీస్శాఖ, సమన్వయంతో ఈ క్లబ్ పనిచేయనున్నది. ఈ కమిటీలో ప్రతి తరగతి నుంచి ఇద్దరు చురుకైన అమ్మాయిలు సభ్యులుగా ఉంటారు. వీరే పాఠశాల బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చైర్మన్గా ఒక ఉపాధ్యాయుడు మెంబర్ కన్వీనర్గా ఉంటారు. ఈ కమిటీ ఫిబ్రవరి వరకు పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు (నెలకు ఒకటి చొప్పున) నిర్వహిస్తుంది.
ఫిబ్రవరి వరకు కార్యక్రమాల నిర్వహణ..
అక్టోబర్ 21 నుంచి 2023 ఫిబ్రవరి 10 వరకు ప్రభుత్వం కార్యచరణ ప్రకటించింది. ఇప్పటికే ఈ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యింది. ఎదుగుదలతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత పరిశభ్రత, జీవన నైపుణ్యంపై ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో వైద్యుల సహకారంతో అవగాహన కల్పించారు. బాలికల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, లైంగిక దాడులకు అడ్డుకోవడంపై అవగాహన సదస్సులు, బాల్య వివాహాలు, హింస, తదితర సమస్యలపై చర్చించనున్నారు.
కమిటీ సభ్యులు వీరే..
ఉన్నతాధికారుల ఆదేశాలతో పాఠశాలల్లో బాలికా సాధికారిత కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. హెచ్ఎం, టీచర్, ప్రతి తరగతి నుంచి ఇద్దరు చురకైన విద్యార్థినులు, షీటీమ్ సభ్యులు ఈకమిటీలో ఉంటారు. 100, 1098, 181 వంటి టోల్ ఫ్రీ నంబర్లను పాఠశాలలో ప్రదర్శిస్తారు.
సాధికారితే లక్ష్యంగా క్లబ్ల ఏర్పాటు..
ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇప్పటికే కస్తూర్బా బాలికల విద్యాలయంలో బాలికల కమిటీలు వేశాం. బాలికల సమస్యలను పరిష్కరించడానికి ఈ కమిటీలు ఎంతో దోహదపడుతాయి. కమిటీలో ఉన్న బాలికలకు నాయకత్వ లక్షణాలు పెంపొదుతాయి. కమిటీల ఏర్పాటు బాలికలకు ఎంతో మేలు చేకూరుస్తాయని భావిస్తున్నాం.
– కస్తూర్బా ప్రిన్సిపాల్ నాగరాణి
కమిటీ ఏర్పాటు చేశారు..
కస్తూర్బా బాలికల పాఠశాలలో బాలికల సాధికారత కమిటీలను ఏర్పాటు చేశారు. బాలికలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారంపై అవగాహన కల్పించనున్నారు. ఈ కమిటీల ద్వారా తెలుసుకునే విషయాలు ఎంతో లాభం ఉన్నది.
– స్వరూప, 10వ తరగతి
బాలికలను గౌరవించాలి..
సమాజంలో బాలికలను గౌరవించాలి. బాల్యంలో అప్రమత్తంగా ఉండే విధానంపై కొంత అవగాహన వస్తుంది. సమాజం తీరుపై కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. షీటీం సభ్యులను భాగస్వాములను చేస్తే ధైర్యంగా ఉండే వీలుంటుంది.
– మనస్విని, 9వ తరగతి