ప్రజాగాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో మృతిచెందడం అభిమానులు,ప్రజాప్రతినిధులు, యువతను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో లక్షలాది మందిని చైతన్యపరిచి వారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సాయిచంద్ దివికేగారని తెలియడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. జిల్లా మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభాష్రెడ్డి నివాళులర్పించారు. పలుచోట్ల ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహారు సాయిచంద్ అంటూ నినాదాలు చేశారు. మీ స్వరానికి మరణం లేదని, పాట ఉన్నంతవరకు మాతోనే ఉంటారని భావోద్వేగానికి గురయ్యారు.
సంగారెడ్డి జూన్ 29(నమస్తే తెలంగాణ) : గాయకుడు, కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ మృతి పట్ల సంగారెడ్డి జిల్లా ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నెల 22న చివరిసారిగా పటాన్చెరులో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన గంటన్నరకుపైగా పాటలు పాడి ప్రజలను మంత్రముగ్ధులను చేశారు. ‘తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా’ అంటూ పాడిన పాట జిల్లావాసుల గుండెల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. పటాన్చెరు తర్వాత సాయిచంద్ ఎక్కడా బహిరంగంగా పాటలు పాడలేదు. సాయి చంద్ మరణ వార్త వినగానే రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దవాఖానకు చేరుకొని, సాయి పార్థివ దేహన్ని చూసి కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల జిల్లాలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సాయిచంద్తో తమకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన పలు సభలు, సమావేశాల్లో సాయిచంద్ ఉద్యమగీతాలను ఆలపించి అందరినీ తెలంగాణ ఉద్యమంవైపు కదలించారు.
మళ్లీ..మళ్లీ రావాలి కేసీఆర్ సర్కారు.. అంటూ చివరి పాట
సీఎం కేసీఆర్ పటాన్చెరు బహిరంగ సభా వేదికపై సాయిచంద్ గంటరన్నరుపైగా పాటలు పాడారు. ‘తెలంగాణ పల్లెల్లో దండు కదలింది నేస్తమా’ అంటూ పాటలు ప్రారంభించారు. ఆ తర్వాత ఒక్కక్కటిగా పాటలు పాడుతూ బహిరంసభకు హాజరైన జనం, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఉర్రూతలూగించారు. సభకు హాజరైన నాయకులు, కార్యకర్తలతో జై కేసీఆర్..జై తెలంగాణ అంటూ నినాదాలు చేయించారు. బీఆర్ఎస్ నాయకులు సీఎం ఫొటోలు, కండువాలతో నృత్యం చేస్తూ ఉంటూ వారిని ప్రోత్సహించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సాయిచంద్ పాటపడుతూ ఉంటే ఒక ఆడపడుచు తన బిడ్డను ఎత్తుకొని నృత్యం చేస్తూ ఉంటే ఆమెను చూసి సాయిచంద్ పొగడ్తలు కురిపించారు.
వేదికపైన సాయిచంద్ ‘రామనా తందనాలో…కేసీఆర్కు వందనాలు’ అంటూ పాట పాడి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఆతర్వాత పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి గురించి పాట పాడి ఆయన అనుచరుల్లో జోష్ నింపారు. ‘గుండెగల్ల నాయకుడమ్మ గూడెం మహిపాల్ అన్న…గులాబీజెండా వీరుడమ్మ గూడెం మహిపాల్ అన్న’ అంటూ పాట పాడారు. ఈ పాటపై పటాన్చెరు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ నృత్యాలు చేశారు. మళ్లీ ఇదే పాటపాడాలని మహిపాల్రెడ్డి ఆనుచరులు కోరగా, మరోమారు ఇదే పాటను పాడారు. ఆ తర్వాత సాయిచంద్ ‘మళ్లీ మళ్లీ రావాలి కేసీఆర్ సర్కారు’ పాటను పాడి బహిరంగసభలో అందరిలో ఉత్సాహం నింపారు. 22న ఆయన పాడిన పాటలు, చెప్పి న మాటలను అందరూ మననం చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటున్నారు.
తెలంగాణకు తీరని లోటు : ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
మెదక్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో మృతి చెందడంపై సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి సంతా పం ప్రకటించారు. సాయి చంద్ కుటుం బ సభ్యులకు మనోధైర్యం కలగాలని భగవంతున్ని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు.
సాయిచంద్ మృతి బాధాకరం
తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయించంద్ మృతి తీరనిలోటని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరులో ఎమ్మెల్యే మాట్లాడారు. సాయిచంద్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన గాత్రంతో తెలంగాణ ఉద్యమానికి బలం చేకూర్చాడని గుర్తు చేసుకున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ పటాన్చెరుకు వచ్చిన సందర్భంలో సాయిచంద్ అద్భుతమైన పాటలను పాడారన్నారు. అన్నీ తానై కార్యక్రమంలో ఉషారు నింపారన్నారు. రాష్ట్రం గొప్ప కళాకారుడిని కోల్పోయిందని నివాళులర్పించారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తెలంగాణ గొప్ప గాయకుడిని కోల్పోయింది
తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప గాయకుడిని కోల్పోయిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ప్రముఖ గాయకుడు సాయిచంద్ గుండెపోటుతో మృతిచెందడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్లో సాయి చంద్ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించారు.
నివాళులర్పించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు ,రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ మృతికి అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి, సాయిచంద్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చంటి రాహుల్ కిరణ్ ఉన్నారు.