పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా వివిధ పనుల కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నది. మెదక్, సంగారెడ్డి, రామాయంపేట, సదాశివపేట మున్సిపాలిటీలు ఒక్కోదానికి రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఔట్లెట్స్, రోడ్ల మరమ్మతులు తదితర పనులు చేపట్టనున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, టీఎస్ హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ తెలిపారు. నిధుల మంజూరు చేసిన సీఎం కేసీఆర్, అందుకు కృషి చేసిన మంత్రులు కేటీఆర్, హరీశ్రావులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
మెదక్ మున్సిపాలిటీ/రామాయంపేట, జూలై 22: మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల అభివృద్ధి పనులకు రూ.20 కోట్ల చొప్పున టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.40 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి తెలిపారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్ జయరాజ్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి కృష్ణాగౌడ్ తదితరులతో కలిసి మాట్లాడారు. ఈ నిధులతో మున్సిపాలిటీల్లో అవసరమైన చోట్ల డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఔట్లెట్స్, రోడ్ల మరమ్మతులు చేపట్టనున్నామన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ఎంఎన్ కెనాల్ పొంగి ప్రవహించడంతో వెంకట్రావ్ నగర్, సాయినగర్ కాలనీల్లోకి వరద వస్తున్నదని, ఆ నీటిని కాలానీల్లోకి రాకుండా శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు చేపడుతామన్నారు. వానకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
మెదక్ నియోజకవర్గంలో 7 డెంగీ కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నదన్నారు. భారీ వర్షాలతో మెదక్ పట్టణంలోని నయాపూల్ చెరువుకు పెద్ద ఎత్తున నీరు చేరిందని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు. చెరువులు, కుంటలు, తూములు ప్రమాదకరంగా ఉంటే వెంటనే నీటిపారుదల అధికారులకు సమాచారం అందించాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లతో పాటు పురాతన ఇండ్లలో ఉండరాదని సూచించారు. వర్షాలతో కూలిన ఇండ్లకు గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3 లక్షలు మంజూరు చేస్తామన్నారు. రూ.40 కోట్లు మంజూరు చేసిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్రావుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మెదక్ మండల రైతు బంధు అధ్యక్షుడు అంజాగౌడ్, బీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, కిష్టయ్య ఉన్నారు.
సంగారెడ్డి, సదాశివపేటకు ..
సంగారెడ్డి, జూలై 22: సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు రూ.40 కోట్లు మంజూరైనట్లు టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఈ నిధులతో పరిష్కారం అవుతాయని ఆయన పేర్కొన్నారు. గతంలో సంగారెడ్డి మున్సిపాలిటీకీ సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు రూ.50 కోట్లు, టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.10 కోట్లు మంజూరు చేశారన్నారు. సదాశివపేట మున్సిపాలిటీకి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు రూ.25 కోట్లు, టీయూఎఫ్ఐడీసీ రూ.10 కోట్లు మంజూరు చేశారన్నారు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేసిన మంత్రులు హరీశ్రావు, కేటీఆర్కు చింతా ప్రభాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.