జిన్నారం, జనవరి 8: పొట్టకూటి కోసం రాష్ర్టాలు దాటి వచ్చి ఓ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్న వారిని విధి చిన్నచూపు చూసింది. రోజు మాదిరిగానే విధులకు హాజరు కాగా, ప్రమాదం రూపంలో మృత్యువు వారిని కబళించింది. బతుకుపోరులో అగ్నికీలల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. ఆ కుటుంబాల్లో పుట్టెడు విషాదాన్ని నింపింది. ఈ ఘటన బొల్లారం పోలీస్స్టేషన్ పరిధిలోని జిన్నారం మండలంలోని గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలో ఆదివారం జరిగింది. సీఐ సురేందర్రెడ్డి కథనం ప్రకారం.. జిన్నారం మండలంలోని గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని మైలాన్ లాబొరేటీస్ లిమిటెడ్ యూనిట్ -1 పరిశ్రమలో కాంట్రాక్టు పద్ధతిలో కార్మికులుగా పశ్చిమ బెంగాల్కు చెందిన పరితోశ్ మెహతా(40), బీహార్కు చెందిన రంజిత్కుమార్(27), ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన లోకేశ్వర్(38) అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం ఎఫ్యూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఈటీపీ)లో అగ్ని ప్రమాదం జరిగింది.
దీంతో టెట్రా మిథైల్ డిసిలోక్సైన్ అనే కెమికల్ డ్రమ్ములకు మంటలు అంటుకుని ఒక్కసారిగా భారీగా వ్యాపించాయి. దీంతో ఈ ముగ్గురు వలస కార్మికులు సజీవ దహనమయ్యారు. ప్రమాద విషయం తెలియడంతో పరిశ్రమలోని కార్మికులతో పాటు సమీపంలోని పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఫైర్ ఇంజిన్లు చేరుకుని మంటలు ఆర్పేశాయి. బొల్లారం సీఐ సురేందర్రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు పరిశ్రమను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.