మద్దూరు(ధూళిమిట్ట), మే 29: హరిత తెలంగాణే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించింది. హరితహారంలో నాటిన మొక్క లు ఏపుగా పెరిగి పచ్చదనంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కొన్ని గ్రామాల్లో విద్యుత్ వైర్లకు పచ్చని చెట్లు అడ్డువస్తున్నాయనే కారణంతో ఆ చెట్లను తొలిగిస్తున్నారు. దీంతో నిన్నమొన్నటి దాకా పచ్చదనాన్ని పంచిన వృక్షాలు ప్రస్తుతం మోడుగా మారాయి. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రం నుంచి చేర్యాలకు వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి సంరక్షించారు. మొక్కల చుట్టూ పాదులు తీసి, ఎరువులు చల్లి, ట్యాంకర్ సహాయంతో ప్రతి మొక్కకూ నీరందించి సంరక్షించారు. ఆ చెట్లు బాటసారులను ఎంతగానో ఆకర్షించేవి. అలాంటి చెట్లను ఇటీవల విద్యుత్ శాఖ అధికారులు నిర్ధాక్షిణ్యంగా నరికివేశారు. విద్యుత్ వైర్లకు చెట్ల కొమ్మలు అడ్డువస్తే కొమ్మలను తొలిగించాలే తప్పా చెట్లను తొలిగించడమేమిటని గ్రామస్తులు మండిపడుతున్నారు. వన సంపదను కాపాడాల్సిన అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడడమేంటని ప్రకృతి ప్రేమికులు ప్రశిస్తున్నారు.