హత్నూర, ఫిబ్రవరి 10 : అనారోగ్యంతో తండ్రీకొడుకు మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొత్తగూడెం శివారులోని మాన్సింగ్ ఇటుకబట్టీ వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హత్నూర ఎస్సై సుభాష్ వివరాల ప్రకారం..ఒడిశా రాష్ర్టానికి చెందిన అమలాల్ మొహజీ(35) తన భార్య నర్మద మొహజీ, ఇద్దరు కొడుకులు జైమొహజీ, అన్షు మొహజీతో కలిసి కొత్తగూడెం శివారులోని ఇటుక బట్టీలో రెండునెలలుగా కార్మికులుగా పనిచేస్తున్నారు. కొద్దిరోజులుగా అమలాల్ మొహజీ, చిన్నకొడుకు రెండున్నర ఏండ్ల అన్షుమొహజీ విరేచనాలతో బాధపడుతూ అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి విరేచనాలు ఎక్కువ కావడంతో చికిత్స నిమిత్తం ఇటుబట్టీల యజమాని మాన్సింగ్ తన కారులో సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించాడు. అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య నర్మద మొహజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ సుభాష్ తెలిపారు.
కనీస సౌకర్యాలు కరువు…
ఇటుక బట్టీల వద్ద ఇటుకబట్టీల యజమానులు కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి కుటుంబాలతో జీవనోపాధి కోసం వచ్చిన కార్మికులతో పనిచేయించుకుంటున్న యజమానులు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతుండడంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటుకబట్టీల వద్ద వెలువడే దుమ్ముధూళితో అనారోగ్యానికి గురవుతున్నారు. కార్మికులకు సమయానికి చికిత్స అందించక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రాణాల మీదికి వస్తున్నది. పెద్దలతో పాటు చిన్నారులు వారి తల్లిదండ్రుల వెంట పనులు చేస్తుండటంతో అనారోగ్యాల బారిన పడుతున్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలనకు, వారి సంక్షేమానికి కృషిచేయాల్సిన సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.