ఝరాసంగం, మార్చి 26 : రైతులు బాగుంటేనే దేశం బాగుంటదని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కుప్పానగర్ గ్రామ శివారులో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నేలకొరిగిన జొన్న పంటను ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి నివేదిక అందించాలన్నారు. పంటలు దెబ్బతిని వారంరోజులు గడిచినప్పటికీ అధికారులు, ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు గడిచినా ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. అనంతరం కుప్పానగర్లో రేణుకాఎల్లమ్మ ఆలయ 30వ వార్షికోత్సంలో పాల్గొని అమ్మవారికి అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశం, ఎంపీటీసీ రాజు, మాజీ సర్పంచ్ శంకరయ్య, నాయకులు బొగ్గుల సంఘమేశ్, నర్సింహులు ఉన్నారు.