హత్నూర, జూన్ 4: తాము చస్తేనే ధాన్యం కొంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు గురువారం హత్నూర తహసీల్ కార్యాలయం ఎదుట నర్సాపూర్-జోగిపేట ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నవాబుపేట రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి ధాన్యం నెల రోజులు గడుస్తున్నా పట్టించుకునే వారులేరని, దీంతో ఎక్కడి ధా న్యం అక్కడ కుప్పలు కుప్పలుగా ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిత్యం ఎండబెడుతూ ధాన్యం కుప్పల వద్ద కాపలా ఉంటున్నామని, అయినా కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కొనుగోలు కేంద్రం పరిశీలనకు వచ్చే ప్రతి అధికారి నేడు, రేపు అంటూ కాలం వెల్లదీస్తున్నారేగానీ ధాన్యం కొనడం లేదని ఆరోపిస్తున్నారు. వా నకాలం సమీపిస్తున్నా స్పందన లేదన్నారు. ఏపీఎం రాజశేఖర్ దృష్టికి తీసుకెళ్లినా లారీలు రావడం లేదని, తానేం చేయాలని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడని ఆరోపించారు.
నెల రోజులు అవుతున్నా ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. రాత్రింబవళ్లు కొనుగోలు కేంద్రం వద్ద కాపలా ఉంటున్నాం. వర్షానికి తడిసిన ధాన్యం ముద్దవుతుంటే ఆరబెట్టడం తప్ప కొనడంలేదు. ఎన్నిసార్లు బతిమాలినా పట్టించుకుంటలేరు. మా బాధ ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఏనాడు ఇంత దారుణమైన పరిస్థితి ఎదురుకాలేదు.
– వెంకటపురం శ్రీశైలం, రైతు, హత్నూర
రైతులు చస్తేనే పట్టించుకుంటారా. రైతులు అంటే ఈ ప్రభుత్వానికి ఇంత చిన్నచూపు ఎందుకు. రెండు నెలలకు కావస్తున్నది ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి. రోజు నిర్వాహకులను బతిమాలినా వారికి ఇష్టం వచ్చిన వారి ధాన్యం కొంటున్నారంతే. అప్పులు చేసి పంట సాగు చేస్తే ధాన్యం అమ్ముడుపోక చేసిన అప్పులకు మిత్తీలు ఎక్కువవుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోతే చావే శరణ్యం.
– జక్కుల రాములు, రైతు, హత్నూర