మెదక్ అర్బన్ : తడిసిన ధాన్యాన్ని ( Wet Grain ) వెంటనే కొనుగోలు చేయాలని, గ్రామంలో ఉన్న కొనుగోలు కేంద్రానికి లారీలను, గోనె సంచులను వెంటనే పంపించాలని కోరుతూ బుధవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సర్దన రైతులు నిరసన( Farmers Protest ) తెలిపారు. రైతులు మాట్లాడుతూ గ్రామంలో ఐకెపీ సెంటర్ నిర్వాహకులు లారీలను తెప్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో ధాన్యంపై ప్లాస్టిక్ కవర్లు కప్పిన అవి గాలికి కొట్టుకుపోవడంతో ధాన్యం తడిసి ముద్దయిందని వాపోయారు. వాటిని మళ్లీ ఆరబెట్టి అమ్మాలంటే కష్టమైన పనిగా ఉంటుందని అన్నారు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ధాన్యం తడిసేది కాదని తెలిపారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ నాగేష్ రైతుల వద్దకు వచ్చి వారిని సముదాయించారు. జిల్లాలో కూలీల కొరత ఉన్నందున కొంత సమయం పడుతుందని లారీల కొరత లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.