రామాయంపేట, జూన్ 01 : రైతుపై ఎలుగుబంటి(Bear attack) దాడికి పాల్పడిన సంఘటన రామాయంపేట మండలం సదాశివనగర్(Sadashicanagar) గిరిజన తండాలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. విరాలల్లోకి వెళ్తే.. గిరిజన తండాకు చెందిన బాట్రోత్ హనుమంతు శనివారం రాత్రి తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి రాత్రి పొలానికి నీళ్లుపెట్టి తెల్లవారుజామున పొలం నుండి ఇంటికి బయలు దేరాడు. మార్గమధ్యలోని అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి హనుమంతుపై దాడిచేసింది. వెంటను రైతువద్ద ఉన్న కర్రతో తిరిగి దాడి చేయడంతో ఎలుగుబంటి వెళ్లిపోయింది.
గాయపడిన రైతు హనుమంతును వెంటనే కుటుంబ సభ్యులు రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. రాత్రి పూట వ్యవసాయ బావుల వద్దకు వెళ్లవద్దని, వెళ్లినా చేతిలో కర్ర సహాయంతో వెళ్లాలని సూచించారు. గతంలోనే రైతులకు అడవి జంతువులపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. అడవి జంతువులపై నిఘా పెడుతామని తెలిపారు. రైతులు మాత్రం రాత్రి ఒంటరిగా బావుల వద్దకు వెళ్లొద్దని సూచించారు.