మెదక్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : వచ్చే నెల 30న నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగులు, 80 ఏండ్ల పైబడిన వృద్ధులు ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తున్నది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానం విజయవంతం కావడంతో రాష్ట్రంలోనూ అమలుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపడుతున్నది. ఈ నెల 4న ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం మెదక్ జిల్లాలో 4,34,275 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో వయో వృద్ధు లు 4151 మంది, దివ్యాంగులు 8863 మంది ఉన్నారు. ఇలాంటి వారు ఇంటి వద్దనే తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు చర్య లు చేపడుతున్నారు.
ఎన్నికల కమిషన్ ప్రతి పోలింగ్ కేంద్రంలో వారం ముందుగానే డీ-12 ఫారం అందుబాటులోకి తెచ్చింది. ఓటరు జాబితాలో పేరు కలిగిన 80 ఏండ్ల్లు పైబడిన వయోవృద్ధులతోపాటు 40 శాతానికి మించి వైకల్యం కలిగిన దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇందుకోసం సంబంధిత బీఎల్వోల వద్ద 12 డీ ఫారంలో తమ పూర్తి వివరాలు నమోదు చేసి నవంబర్ 7వ తేదీలోపు బీఎల్వోలకు అందజేయాలి. ఇలా అందజేసిన వారికి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
నవంబర్ 30న రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అన్ని జిల్లాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఇప్పటి నుంచే ప్రచారం నిర్వహిస్తున్నది. మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 4,34,275 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,24, 337 మంది మహిళలు, 2,09,927 మం ది పురుషులు, ఎన్ఆర్ఐ ఓటర్లు 9, సర్వీస్ ఓటర్లు 124 మంది ఉన్నట్లు అధికారులు జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. మెదక్ నియోజకవర్గంలో 274 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 2,14,064 మంది ఉండగా, అందులో 1,02, 340 మంది పురుషులు, 1,11,720 మంది మహిళలు, ఇతరులు 85 మంది ఉన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 305 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 2,20,211 మంది ఉండగా 1,07, 587 మంది పురుషులు, 1,12,617 మంది మహిళలు, ఇతరులు 39 మంది ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 80 ఏం డ్లకు పైబడిన వారు 4151 మంది కాగా, దివ్యాంగులు 8863 మంది ఉండడంతో వీరందరికీ డీ-12 ఓటు విధానంపై అవగాహన కల్పిస్తున్నారు.