ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదలు జీవో 58, 59 కింద తమ స్థలాలు క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 30 వరకు గడువు పెంచిందని సంగారెడ్డి కలెక్టర్ శరత్ కుమార్ తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో జీవో 58,59, ల్యాండ్ ఫూలింగ్ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పరిధిలోని అర్హులందరూ దరఖాస్తు చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని, అర్హులెవరికీ అన్యాయం జరగొద్దని, అనర్హులెవరూ జాబితాలో ఉండొద్దని సూచించారు. ప్రతి మున్సిపాలిటీలో ల్యాండ్ ఫూలింగ్ కింద 25 ఎకరాల భూమిని గుర్తించి ఈ నెల 17లోగా స్వాధీనం చేసుకోవాలన్నారు. భూ సేకరణ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 14: జీవో 58, 59 కింద భూ క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గడువు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో జీవో 58, 59 దరఖాస్తులు, ల్యాండ్ పూలింగ్ తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవో 58, 59 కింద అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఆక్రమించుకుని ఇండ్లు నిర్మించుకున్న పేదలు తమ ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.
అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు నూతనంగా దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. తమ పరిధిలో అర్హులందరూ దరఖాస్తు చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. గతంలో జీవో 58, 59 కింద తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులు ఏ ఒక్కరికీ అన్యాయం జరగొద్దని, అనర్హులెవరూ జాబితాలో ఉండొద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. లబ్ధిదారులు 2020 జూన్ 2వ తేదీ వరకు సంబంధిత స్థలం వారి ఆధీనంలో ఉన్నట్టు ఆధారాలు చూపాల్సి ఉంటుందన్నారు. జీవో 59 కింద పెండింగ్లో ఉన్న రుసుము చెల్లింపులపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు.
ప్రతి మున్సిపాలిటీలో ల్యాండ్ పూలింగ్ కింద 25 ఎకరాల భూమిని గుర్తించి ఈ నెల 17లోగా స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లను ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీలో ల్యాండ్ పూలింగ్ కింద సేకరించిన భూమిలో లే అవుట్ చేసి స్థలాలు కోల్పోయిన వారికి ఎకరాకు 600 గజాల చొప్పున ఇస్తారని కలెక్టర్ తెలిపారు. అసైన్డ్ల్యాండ్ భూ లబ్ధిదారులైనట్లయితే, వారి సమ్మతితో మాత్రమే భూ సమీకరణ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో లబ్ధిదారుల సమ్మతితో భూ సమీకరణ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలను ఆదేశించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ సురేశ్, పంచాయతీరాజ్ ఈఈ జగదీశ్వర్, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.