న్యాల్కల్, డిసెంబర్ 21: వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో ఒక్కసారిగా పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఎముకల కొరికే చలితో ఉదయమే వివిధ పనుల నిమిత్తం వెళ్లే కూలీలు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు జంకుతున్నారు. చలి తీవ్రతతో కొందరైతే తెల్లవారినా దుప్పట్లను విడవక, మంట, ఎండను ఆశ్రయిస్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సైతం పడిపోతుండడంతో సాయంత్రం 6 గంటలకే ప్రజలు ఇండ్లలోకి జారుకుంటున్నారు. చలి తీవ్రత నుంచి రక్షించుకునేందుకు ప్రజలు స్వెటర్లు, జర్కిన్, మప్లరు, మంకీ క్యాప్లు, ఉన్ని దుస్తులు, చేతులకు గ్లౌస్లు, కాళ్లకు సాక్స్లను వినియోగించుకుంటున్నారు. గతేడాది కంటే అధికంగా ధరలు పెరిగినప్పటికీ చలి తీవ్రత నుంచి కాపాడుకునేందుకు తప్పని పరిస్థితుల్లో వాటిని కొనుగోలు చేయాల్సి వస్తుందని ప్రజలు అంటున్నారు. వాహనాలపై దూర ప్రాంతాలకు వెళ్లేందుకు వాహనచోదకులు సాహసించడం లేదు.
అత్యవసరం ఉంటేనే హెల్మెట్, జర్కిన్, గ్లౌస్లను వేసుకొని వెళ్తున్నారు. గతేడాది కంటే ఈ సారి చలి ప్రభావం ఎక్కవగా ఉండడంతో ఇంటి అవరణలో చలిమంటలు ఏర్పాటు చేసుకొని చలి తీవ్రతను తట్టుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. చలి మంటల వద్ద కూర్చునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు అభిప్రాయపడున్నారు. చలి మంటల వద్ద ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉందంటున్నారు. పొగకు కండ్లు తిరిగి పడిపోయే ప్రమాదముందని, ఒక్కోసారి లోబీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దుప్పట్లు కప్పుకొని మంటల వద్ద కూర్చుంటే అవి అంటుకొని ప్రమాదం జరిగే అవకాశాలుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరికొందరు మంచాల కింద నిప్పులు పెట్టుకుని పడుకోవడం మంచిది కాదంటున్నారు. ఏది ఏమైనప్పటికీ చలికాలం ముగిసే వరకు తగు జాగ్రతలు తీసుకుంటే మంచిదంటున్నారు.