మెదక్, నవంబర్ 17 : ప్రపంచంలోని అనేక దేశాల్లో కరోనా మూడో వేవ్ వచ్చిన దృష్ట్యా జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో 7,67,428 మంది జనాభాకు గాను 5, 48,340 మంది అర్హులకు కరోనా టీకాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, మొదటి డోస్గా 92 శాతం పైగా 5,04,749 మందికి టీకాలు వేశామని అన్నారు.
కాగా రెండో డోసుగా 1,91,818 మంది అనగా 38 శాతం మాత్రమే తీసుకున్నారని వివరాలను వెల్లడించారు. టీకాల పట్ల ఎటువంటి భయం..ఆందోళన, అపోహాలు అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు టీకాలు తీసుకోని వారు వెంటనే టీకాలు తీసుకోవాలని కోరారు.
జిల్లాలో ఒక్క కరోనా కేసు నమోదు కాకుండా ఉండాలంటే అర్హులైన ప్రతి ఒక్కరూ బాధ్యతగా కరోనా టీకా తీసుకోవాలని తద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఇతరులకు రక్షణ కల్పించిన వారమవుతామని అన్నారు.