శివ్వంపేట (మెదక్) : సమాజ మేలు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ కోరారు. గురువారం శివ్వంపేట మండలం గూడురు గ్రామంలో దత్తాత్రేయస్వామి, శిరిడీ సాయినాథ మందిరాల నిర్మాణం సందర్భంగా ఆయన శిలాన్యాసం చేశారు. విశ్వంజీ మహరాజ్ మాట్లాడుతూ మానవ పుట్టుక అత్యంత గొప్పదని, సమాజంలో రక్తపాతం, హింసను విస్మరించి శాంతిని పాటించి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
ప్రకృతిని ఆరాధించాలని, భారతదేశం శక్తివంతమైన దేశంగా మారాలంటే ఐక్యమత్యంగా ఉండాలని అన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచి దైవ చింతన అలవర్చుకోవాలని, దీనివల్ల క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వాకిటి సునీతాలక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, హైకోర్టు సీనియర్ న్యాయవాది జిన్నారం పెద్దగౌని శివకుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.