సిద్దిపేట అర్బన్, మే 26: నల్లగొండ- ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కోసం జిల్లాలోని కొమురవెల్లి, చేర్యాల, ధూళిమిట్ట, మద్దూర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు సిద్దిపేట కలెక్టరేట్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి ఆదివారం పోలింగ్ సామగ్రిని తరలించారు. పోలింగ్ సిబ్బంది పోలీస్ ఎస్కార్ట్తో ఆర్టీసీ బస్సుల్లో పోలింగ్ సామగ్రిని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. పోలింగ్ సామగ్రితో సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నట్లు తెలిపారు. ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ పోలింగ్లో ఆరుగురు ప్రిసైడింగ్ అధికారులు, ఆరుగురు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఆరుగురు ఇతర పోలింగ్ అధికారులు, 12 మంది మైక్రో అబ్జర్వర్లు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. చేర్యాల మండల కేంద్రంలో రెండు పోలింగ్ బూత్లు, కొమురవెల్లి, ధూళిమిట్ట, మద్దూర్లో ఒక్కో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ కొనసాగుతుందని, ఈ 4 మండలాల్లో మొత్తం 4,659 మంది పట్టభద్ర ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రెహమాన్, ఇతర అధికారులు ఉన్నారు.