చేర్యాల, ఏప్రిల్ 8 : మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన అగ్నిగుండాలు ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమై సోమవారం వేకువజాము వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఆలయ వర్గాల నేతృత్వంలో వికారాబాద్ జిల్లా కెంపిన మఠం మఠాధీశులు చెన్న బసవప్రభు మహా స్వామీజీ వైదిక పర్యవేక్షణలో నిర్వహించిన అగ్నిగుండాలు ఆధ్యాంతం వైభవంగా జరిగాయి. అగ్నిగుండం స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరడంతోపాటు కష్టాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం.
ఆలయ ఈవో బాలాజీ, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన పర్పాటకం లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బంది, ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణ వేదిక ప్రాంగణంలో రాత్రి 7 గంటలకు వీరభద్ర ప్రస్తాయం, భద్రకాళి పూజ,11 గంటలకు అగ్నిగుండాలు నిర్వహించారు. సోమవారం ఉదయం గురుపూజ, బలిహారణం, అగ్నిగుండాల ప్రవేశం, విజయోత్సవం, స్వామి, అమ్మవార్లకు ఏకాదశ రుద్రాభిషేకం, మహామంగళహారతి, మంత్రపుష్పం, జంగమర్చాన, అనంతరం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.
ఆలయ వర్గాలు వీరశైవ ఆగమశాస్త్ర పద్ధతిలో అగ్నిగుండాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా మర్రి, మేడి, మామిడి, మోదుగు, జువ్వి(ఐదు రకాల చెట్లకు సంబం ధించి) కర్రలను తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిప్పులుగా తయా రు కాగానే వాటిని అగ్నిగుండంగా తయారు చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను ఆల య అర్చకులు గర్భాలయం నుంచి కల్యాణ వేదికకు తీసుకొచ్చి భక్తులు అగ్నిగుండం దాటిన అనంతరం స్వామి వారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
దీంతో కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు 12వ ఆదివారం సందర్భంగా నిర్వహించిన అగ్నిగుండాలతో ముగిశాయి. కార్యక్రమంలో ఏఈవోలు గంగా శ్రీనివాస్, బుద్ది శ్రీనివాస్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, సూపరింటెండెంట్ నీల శేఖర్, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు. అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో సీఐ శ్రీను నేతృత్వంలో ఎస్సైలు నాగరాజు, దామోదర్, యూనస్ఆలీ సమస్యలు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించారు.