సిటీబ్యూరో, జనవరి 25(నమస్తే తెలంగాణ): ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయంతో కూడిన ప్రోత్సాహం, నైపుణ్యాల్లో ఉచిత శిక్షణ అందించడమే లక్ష్యంగా పీఎం విశ్వకర్మ పథకం తోడ్పడుతుందని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ తెలిపారు. తెలంగాణ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఉమెన్ ఆంత్రప్రెన్యూర్ ఆధ్వర్యంలో పీఎం విశ్వకర్మ స్కీంపై ఓరియంటేషన్ సదస్సు నిర్వహించారు. సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్లో జరిగిన ఎంఎస్ఎంఈ, పలు చేతివృత్తిదారులు, కోవే ప్రతినిధులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవృత్తులు, చేతివృత్తులను పరిరక్షించడమే లక్ష్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ పథకం స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ, చిన్న, మధ్య తరహా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సాయపడుతుందన్నారు. ఈ పథకంలో దరఖాస్తు చేసుకున్న వారికి స్కీంలో పేర్కొన్న వృత్తులకు ప్రత్యేక శిక్షణతో నైపుణ్యాలు పెంపొందిస్తారన్నారు. శిక్షణ కాలానికి రోజుకు రూ.500 ైస్టెఫండ్, ఉచిత వసతి సదుపాయం కల్పిస్తారన్నారు.
ఆధార్, ఆధార్ అనుసంధానం చేయబడిన మొబైల్ నంబర్, రేషన్ కార్డుతో దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్లోనే ఎంపిక పూర్తవుతుందన్నారు. కామన్ సర్వీస్ సెంటర్లోనూ ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపికైన వారికి మూడు దశల్లో శిక్షణా కార్యక్రమాలు, బ్యాంకు లోన్ ఫెసిలిటీ, సర్టిఫికెట్ వంటివి అందజేస్తారని తెలిపారు. పీఎం విశ్వకర్మ పథకంలో పేర్కొన్న కులవృత్తుల వారు మాత్రమే అర్హులని, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సరైన వేదిక అవుతుందన్నారు. దరఖాస్తు విధానం, కావాల్సిన దరఖాస్తులు, ఈ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలపై ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ సుమతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కో వే తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ చేతన జైన్, జీఎం డీఐసీ ప్రీతిపవన్ కుమార్, ఎంఎస్ఎంఈ అధికారులు శ్రీనివాసరావు, కో వే ఇండియా సలహాదారు కరుణా గోపాల్, కో వే వైస్ ప్రెసిడెంట్ కల్పనారావు, సెక్రటరీ నీరజా గోదావర్తి, కోశాధికారి నిషా అగర్వాల్, జాయింట్ సెక్రటరీ అనురాధ కారటీ, నాయీ బ్రాహ్మణ సంఘం వైస్ ప్రెసిడెంట్ మల్లేశ్, గోల్డ్ స్మిత్ అసోసియేషన్ రామలింగంచారి తదితరులు పాల్గొన్నారు.