సిద్దిపేట, మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎండలు దంచి కొడుతున్నాయి. ఎన్నడూ లేనంతగా ఠారెత్తుతున్నాయి.రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం ఎనిమిదైంది అంటే చాలు బయటకు కాలు పెట్టలేని పరిస్థితి నెలకొన్నది. సిద్దిపేట జిల్లాలో అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లు 5,51,833 ఉండగా వీటిలో డొమెస్టిక్ కనెక్షన్లు 3,34,580 ఉన్నాయి. దీంతో డిమాండ్కు తగ్గ విద్యుత్ను ప్రభుత్వం
సరఫరా చేస్తున్నది. జనవరిలో 284 మిలియన్ యూనిట్లు, ఫిబ్రవరిలో 295, మార్చిలో 235, ఏప్రిల్లో 335 మిలియన్ యూనిట్ల కరెంట్ను వినియోగిస్తున్నారు. ఎండల జోరుకు ఇండ్లల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు గిర గిరా తిరుగుతూనే ఉన్నాయి. కరెంట్ లేకపోతే ఇంట్లో ఉక్కపోత, బయట ఎండలు, వడగాలుల ధాటికి తట్టుకోలేక ప్రజలు విలవిలలాడే పరిస్థితులు ఉంటుండే. పక్కనే ఉన్న రాష్ర్టాల్లో కరెంట్ బాధలు అన్ని ఇన్ని కావు. సీఎం కేసీఆర్ విజన్తో జిల్లా వ్యాప్తంగా నిరంతరం విద్యుత్ సరఫరా జరుగుతున్నది.
సమైక్య పాలనలో అరకొర కరెంట్తో ఇక్కట్లు పడ్డ ప్రజలు, రైతాంగం ఇవాళ ఆ ఇబ్బందులు తొలిగాయి. దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోల్చుకుంటే నిరంతరంగా 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. విద్యుత్ కోతలు, లోవోల్టేజీ సమస్యలు అసలే లేవు. రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా 24 గంటల కరెంట్ను నిరంతరంగా సరఫరా చేస్తున్నారు. దీంతో ఏరంగం వారు కూడా ఇబ్బంది పడడం లేదు. పక్క రాష్ర్టాల్లో కరెంట్ కోతలు చూస్తే భయం వేస్తుంది. మనకు ఎలాంటి కరెంట్ బాధలు లేకుండా సీఎం కేసీఆర్ నిరంతరం కరెంట్ సరఫరా చేయిస్తున్నారు. ఇవ్వాళ ప్రతి రంగం వారు హాయిగా తమ తమ పనులు చేసుకుంటున్నారు. షిప్టుల పద్ధతిలో సైతం పనులు జరుగుతున్నాయి. పక్క రాష్ర్టాల్లో పవర్ హాలిడే ప్రకటిస్తున్నారు. మనకు అలాంటి ఇబ్బంది లేదు. ఫుల్ కరెంట్.. పుల్ పని ఉంది. వ్యవసాయ రంగం, దుకాణాలు, పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, ఇలా ఏ రంగం చూసుకున్నా పనులన్నీ సాఫీగా జరుగుతున్నాయి.
సిద్దిపేట జిల్లాలో 5,51,833 కనెక్షన్లు
సిద్దిపేట జిల్లాలో అన్నిరకాల కనెక్షన్లు 5,51,833 ఉన్నాయి. వీటిలో 3,34,580 డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. వీటి అవసరాల మేరకు నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్నారు. ఎక్కడి కక్కడ అవసరం మేరకు విద్యుత్ స్తంభాలు, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు బిగించి కరెంట్ను సరఫరా చేయడంతో ఇంత ఎండలున్నా సాఫీగా కరెంట్ సరఫరా చేయగలుగుతున్నారు. జిల్లాలో కమర్షియల్ క్యాటగిరీ-2లో 41,152, పరిశ్రమల క్యాటగిరీ-2లో 3,733, పరిశ్రమల క్యాటగిరీ-4లో 257 కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్లు 1,61,470 ఉన్నాయి. స్ట్రీట్లైట్స్(ఆర్డబ్ల్యుఎస్లో) 7,750, జనరల్ క్యాటగిరీలో 2,102, టెంపరరీ సైప్లె 303 కనెక్షన్లు కాక హెచ్టీ కనెక్షన్లు 486 మొత్తం అన్నిరకాల కనెక్షన్లు కలుపుకొని జిల్లాలో 5,51,833 ఉన్నట్లు విద్యుత్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. జిల్లా ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలోనే ప్రప్రథమంగా సిద్దిపేటలోఎస్ఈ కార్యాలయం ఏర్పాటు కావడంతో విద్యుత్ వ్యవస్థ మరింత పటిష్టమైంది. సర్కిల్ కార్యాలయం ద్వారా లోడ్ మానిటరింగ్, టెక్నికల్ డీఈలు, సివిల్ డీఈలు అందుబాటులో ఉంటున్నారు. దీని ద్వారా నూతనంగా మంజూరయ్యే విద్యుత్ పనులు, మరమ్మతులు త్వరగా పూర్తవుతున్నాయి.
రైతుల వ్యవసాయ కనెక్షన్లు, గృహావసరాల కనెక్షన్లు, పరిశ్రమల కోసం కనెక్షన్లు, నూతన ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు సంబంధించి అనుమతుల సేవలు సర్కిల్ కార్యాలయంలో త్వరగా పూర్తి చేస్తున్నారు.జిల్లా అవసరాల కోసం ముందస్తు ప్రణాళికతో మంత్రి హరీశ్రావు సిద్దిపేట పట్టణంలో విద్యుత్ పరికరాల స్టోర్ను అందుబాటులోకి తెచ్చారు. దుబ్బాక, హుస్నాబాద్లో విద్యుత్ ఉప కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ తీగలు, విద్యుత్ పరికరాలు, అందుబాటులో ఉంటున్నాయి. గతంలో సంగారెడ్డికి వెళ్లి విద్యుత్ పరికరాలు తెచ్చుకోవాల్సి ఉండడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. ఇప్పుడు జిల్లాలో ఏ గ్రామంలోనైనా ఎంతటి విద్యుత్ సమస్యలు వచ్చినా కావాల్సిన పరికరాలు, టెక్నికల్ స్టాఫ్ అందుబాటులో ఉండడంతో సమస్యలను తొందరగా పరిష్కరిస్తున్నారు. దీంతో ఇంత ఠారెత్తుతున్న ఎండల్లో సైతం కునుకు పాటు కరెంట్ పోకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నారు.ఎలాంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా విద్యుత్ సరఫరా కావడంతో ప్రజలు హాయిగా ఉన్నారు. లోవోల్టేజీ వంటి సమస్యలు ఉత్పన్నం కావడం లేదు. నాణ్యమైన విద్యుత్ను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మన్నలను పొందుతున్నది.
విద్యుత్ వ్యవస్థ పటిష్టం
సిద్దిపేట జిల్లాలో 2022-23 సంవత్సరంలో ఇప్పటి వరకు 1732 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 2,657 కి.మీటర్ల వైరు మరియు 31,906 విద్యుత్ స్తంభాలు బిగించారు. దీన్దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల విద్యుదీకరణలో భాగంగా 482 కొత్తగా 25కేవీఏ 1హెచ్పీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. బీపీఎల్ కింద 30,227 ఇంటి సర్వీసు కనెక్షన్లను ఒక్కో దానికి రూ. 125 కే అందించారు. ఇంటిగ్రేటేడ్ పవర్ డెవలప్మెంట్ స్కీం కింద సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ పట్టణాల్లో 243 కొత్త 100 కేవీఏ , 26 కొత్త 160 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 82 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం 160, 250, 315 కేవీఏ సామర్థ్యం కలిగినవి ఉన్నాయి. ఇందుకు 1028 హెచ్టీ స్తంభాలు, 2432 ఎల్టీ స్తంభాలు ఏర్పాటు చేశారు. 41.12 కి.మీటర్ల హెచ్టీ లైన్, 97.5 కి.మీటర్ల ఎల్టీ లైన్ను కొత్తగా ఏర్పాటు చేశారు. దీనికి ప్రభుత్వం రూ. 26.90 కోట్లు ఖర్చు చేసింది.
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి 3,750 శిథిలావస్థకు చేరిన స్తంభాలు, పాతవి, తుప్పు పట్టిన 1358 స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. 10,926 లూస్ లైన్స్ సరి చేశారు. 6,613 మిడిల్ స్తంభాలు, 2,760 వంగిన స్తంభాలు సరిచేశారు. ఇందుకు ప్రభుత్వం రూ. 6.80 కోట్లు ఖర్చు చేసింది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రూ. 3. 20 కోట్లతో1344 లూస్ లైన్స్ స్తంభాలు, 1029 మిడిల్ స్తంభాలు ఏర్పాటు చేశారు. 924 శిథిలావస్థలో ఉన్న, 656 తుప్పు పట్టిన స్తంభాల స్థానంలో కొత్త వాటిని బిగించారు. 526 వంగిన స్తంభాలను సరిచేయడంతో పాటు 999 స్తంభాల స్ట్రీట్ లైట్ వైరు, 83 కొత్త స్ట్రీట్ లైట్ మీటర్లు ఏర్పాటు చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని లోవోల్టేజీ , అధిక లోడ్ను అధిగమించడానికి కొత్తగా 32 కి.మీటర్ల 33 కేవీలైన్, 5 అదనపు సబ్స్టేషన్లలో ట్రాన్స్ఫార్మర్లు, 175 డిస్ట్రిబ్యూటర్ ట్రాన్స్ఫార్మర్లను రూ. 10 కోట్లతో ఏర్పాటు చేశారు.
రజకులకు మరియు నాయీబ్రాహ్మణులకు కొత్తగా ఒక్కొక్కరికి రూ. ఎనిమిది వేలు ఖర్చు చేసి విద్యుత్ మీటర్లు, విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేసి 3,300 సర్వీస్ కనెక్షన్లు ఇచ్చారు. 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నది.జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా నాలుగు 33/11 కేవీ ఉపకేంద్రాలను బండమైలారం, బండతిమ్మాపూర్, తునికిబొల్లారం, మందపల్లి గ్రామాలకు మంజూరు చేశారు. ఈ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. కొత్త కాలనీలకు సిద్దిపేట కేసీఆర్నగర్, గజ్వేల్ ఆర్ఆర్కాలనీ, ముట్రాజ్పల్లిలో 33/11 కేవీ సబ్స్టేషన్లు మంజూరుకాగా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ రకంగా జిల్లాలో విద్యుత్ వ్యవస్థను పటిష్టపర్చడంతో ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరం కరెంట్ సరఫరా జరుగుతున్నది.