మాఘమ అమావాస్య.. అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించే రోజు. అందరి మనసులను భక్తి సాగరంలో ముంచెత్తే వేడుక. మాఘ మాసంలో బహుళ అమావాస్య అందరినీ దైవ సన్నిధికి నడిపిస్తూ మోక్ష ప్రాప్తి కోసం ఆలోచింపజేస్తుంది.
ఈ రోజు కోసం ఎదురుచూస్తున్న భక్తజనం ఎందరో! మాఘమ అమావాస్యతో ముడిపడి ఉన్న పుణ్యక్షేత్రాలు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో చాలా ఉన్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో చాలాచోట్ల జాతరలు పెద్ద ఎత్తున కొనసాగుతాయి. జిల్లావాసులే కాక, సరిహద్దు జిల్లాలు, రాష్ర్టేతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో సుప్రసిద్ధ ఆలయాల విశిష్టత, ప్రాశస్త్యం, స్థల పురాణాలు, చారిత్రక విశేషాలు మీ కోసం…
మాఘ అమావాస్యకు ఏడుపాయల ముస్తాబు
మాఘ అమావాస్య సందర్భంగా నిర్వహించే జాతరకు ఏడుపాయల దుర్గామాత ఆలయం ముస్తాబైంది. పుణ్యస్నానాల కోసం తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ప్రాంతాల నుంచి సుమారు లక్షమంది వరకు భక్తులు వస్తారని ఎండోమెంట్ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద షవర్లు ఏర్పాటు చేశారు. చెక్డ్యాంలో సైతం ఘనపూర్ ఆనకట్ట నుంచి నీటిని నింపారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యం కోసం క్యూలైన్లు ఏర్పాటు చేశారు. షామియానాలు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. బొడ్మట్పల్లి, జహీరాబాద్, రాయిపల్లి, బీదర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నిలపడానికి నాగ్సాన్పల్లి వైపు ఉన్న చెలిమెల కుంట వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, నర్సాపూర్, మెదక్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను నిలపడానికి టేకుల గడ్డ వద్ద ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ కమిటీ చైర్మన్ బాలాగౌడ్, ఆలయ ఈవో సార శ్రీనివాస్ వెల్లడించారు. ఏడుపాయల వద్ద పాపన్నపేట ఎస్సై విజయ్కుమార్ శుక్రవారం సాయంత్రం బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 20 మంది ఎస్సైలు.. మొత్తం 190 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
ప్రత్యేక బస్సులు
మాఘ అమవాస్యను పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం మెదక్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రవిచందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకో బస్సు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ బస్సులు మెదక్ నుంచి నాగ్సాన్పల్లి, ఏడుపాయల, టేకులగడ్డ, పోతన్శెట్టిపల్లి చౌరస్తా వరకు నడుపుతున్నట్లు తెలిపారు.
జాతరకు గట్టి బందోబస్తు: మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్ అర్బన్, జనవరి 20: మాఘ అమావాస్య పండగను పురస్కరించుకొని ఏడుపాయల జాతరలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పుణ్యస్నానాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు.