పాపన్నపేట, జులై31 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో భక్తులు రాజగోపురంలోనే పూజలు నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాల మూలంగా ఆలయం ముందు నుంచి భారీ ఎత్తున మంజీర నది ప్రవహించిన సంగతి తెలిసిందే.
దీంతో అప్పటి నుంచి వనదుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల వరద ఉధృతి కొంతమేర తగ్గినప్పటికి ముందు జాగ్రత్తలో భాగంగా భక్తులను అమ్మవారి మూల విరాట్ విగ్రహం దర్శనానికి అనుమతించడం లేదు.
కేవలం వేద పండితులే వేకువజామున అమ్మవారి వద్దకు వెళ్ళి అర్చనలు నిర్వహిస్తున్నారు. అనంతరం రాజగోపురంలోనే భక్తులు ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించుకునేలా ఏర్పాటు చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీగానే తరలివచ్చారు.