జహీరాబాద్/ పటాన్చెరు/ అందోల్/ హత్నూర/ సిర్గాపూర్/ కంగ్టి/ సదాశివపేట/ న్యాల్కల్, డిసెంబర్ 7: మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో దత్త జయంతిని ఘనంగా నిర్వహించారు. బుధవారం దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు నిర్వహించారు. ఝరాసంగం మండలంలోని బర్థిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు 108 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ల ఆధ్వర్యంలో యజ్ఞాలు నిర్వహించారు. ఆశ్రమ ఆవరణలో లోక కల్యాణార్థం వంద రోజుల పాటు రుద్ర సహిత దత్త యజ్ఞం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మాతృశ్రీ అనసూయ మాత, ఆనంద గిరి మాత, వైదిక పాఠశాల పురోహితులు శివశంకర్స్వామి, విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు.
పటాన్చెరు మండలంలోని ముత్తంగిలో స్వామి కల్యాణం, జోగిపేటలోని మాణిక్ప్రభు మందిరంలో, సిర్గాపూర్, కంగ్టి, సదాశివపేట మండలాల్లో దత్త జయంతిని పురస్కరించుకుని పూజలు నిర్వహించారు. సదాశివపేట పట్టణంలో దత్త జోలి ద్వారా భిక్షాటన చేశారు. న్యాల్కల్ మండలంలోని ముంగి ఆదిలక్ష్మి ఆశ్రమంలో దత్తాత్రేయ స్వామికి కుం కుమార్చనలు, అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు, హో మాలు నిర్వహించారు. ఈ ఆశ్రమంలో శుక్రవారం జయంతివేడుకలు నిర్వహిస్తామని ఆశ్రమ పీఠాధిపతి దేవగిరి మహారాజ్ తెలిపారు. ఆయా ఆలయాల్లో పూజల అనంతరం భక్తులకు అ న్నదానం చేశారు. పటాన్చెరు మండలం ముత్తంగిలో సర్పంచ్ ఉపేందర్ముదిరాజ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ తరఫున దత్తాత్రేయుడికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. వైస్ ఎంపీపీ స్వప్నశ్రీనివాస్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్గౌడ్, ఉప సర్పంచ్ లింగారెడ్డిలు పూజల్లో పాల్గొన్నారు.
దత్త జయంతిని పురస్కరించుకొని హత్నూర-మాధుర శివాలోని దత్తాచలక్షేత్రంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి దంపతులు, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, జబర్దస్త్ షో నటులు ఆటో రాంప్రసాద్, కెవ్వు కార్తీక్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు ప్రజాప్రతినిధులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం ఎమ్మెల్యే మదన్రెడ్డి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించారు.