చేర్యాల, జనవరి 21 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్వామివారి క్షేత్రానికి కరెంటు సరఫరా లేకపోవడంతో గదులకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఆదివారం ఉదయం 7 నుంచి మధ్నాహ్నం 2 గంటల వరకు కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా నీటి అవసరాలు ఉండే ఉదయం పూట కరెంట్ లేకపోవడంతో భక్తుల పరిస్థితి వర్ణణాతీతంగా మారిం ది. క్షేత్రంలో భక్తులు బస చేసిన గదులకు నీటి సరఫరా లేకపోవడంతో సమీపంలో ఉన్న సబ్స్టేషన్ వద్దకు వెళ్లి ట్రాన్స్కో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కరెంట్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఉందని, భక్తులకు సేవలందించ లేకపోతున్నామని ఆలయ సిబ్బంది కొందరు ‘నమస్తే తెలంగాణ’తో వాపోయారు. కరెంట్ సరఫరా లేనప్పుడు తోటబావి వద్ద ఉన్న జనరేటర్ ద్వారా ఆయా బోరుమోటర్లకు కరెంట్ సరఫరా చేసి భక్తులకు సరిపడా నీటిని సరఫరా చేస్తారు. కానీ, ఇదే సమయంలో నీటిని అందించే మోటర్లకు కరెంట్ సరఫరా చేసే మెయిన్ జనరేటర్ సైతం మొరాయించడంతో ఆలయ వర్గాలు చేతులెత్తేశాయి.
గుడిలో కరెంట్ సరఫరాలో అంతరాయం ఉండడంతో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు ఇతర దారులు వెతుకున్నారు. సమీపంలోని వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి బిందెకు రూ.20, స్నానాలకు రూ.20 చెల్లించారు. డబ్బా మంచి నీటికి రూ.50 ఇచ్చి తెచ్చుకున్నారు.
స్వామివారి క్షేత్రంలో ఎక్కడపడితే అక్కడ చెత్తకుప్పులు పేరుకుపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్వామివారి పట్నం వారం సందర్భంగా క్షేత్రంలోని వివిధ ప్రదేశాల్లో దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో భక్తులు అక్కడ ప్లాస్టిక్ ప్లేట్స్లో ప్రసాదం, పాయసం, అన్నం అందజేశారు. వాటిని కొందరు అక్కడే తినిపడవేయగా, మరికొందరు ఇతర ప్రదేశాల్లో ప్లేట్స్ను పడవేయడంతో చెత్త కుప్పులుగా పేరుకుపోయింది. చెత్తపేరుకుపోయిన విషయాన్ని విలేకరులు ఈవో బాలాజీ దృష్టికి తీసుకుపోవడంతో అన్నదాన కార్యక్రమాలను పద్ధతిగా చేసే విధంగా చర్యలు చేపడుతామన్నారు.
కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలను వై భవంగా నిర్వహిస్తామని, భక్తులకు సకల వసతులు కల్పిస్తామని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల అధికారులతో నిర్వహించిన సమీక్షలో చెప్పారు. కానీ, పట్నం వా రం రోజున భక్తులు తాగునీటి కష్టాలతోపాటు ఇతరాత్ర అవసరాలకు ఉపయోగించుకునే నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని పలువురు భక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.