ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆయన వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు.
మెదక్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలు విజయవంతం చేయడంలో అధికారులు నిబద్ధతతో పనిచేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో మాట్లాడుతూ వివిధ శాఖల్లో అమలవుతున్న కార్యక్రమాలను వారం వారం సమీక్షిస్తానని, ప్రగతి స్పష్టంగా కనిపించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో డంప్ యార్డులు వాడుకల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని, తడి, పొడి చెత్తను వేరు చేస్తూ సేంద్రియ ఎరువులు తయారు చేసేందుకు ఏజెన్సీలతో అనుసంధానం చేయాలని డీపీవోకు సూచించారు.
ప్రతి వైకుంఠధామానికి నీటి సరఫరా ఉండేలా చూడాలని, నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యానికి లక్ష లోపు అయ్యే వాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, చేతి పంపులు లేదా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని, ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పనులు కల్పించడంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, వచ్చే సీజన్లో ప్రభుత్వ స్థలాల్లో, రోడ్లవెంట పలు వరుసల్లో మొకల పెంపకానికి గ్రామ పంచాయతీ వారీగా లాంగిట్యూడ్, లాటిట్యూడ్లో ప్రాంతాలను ఎంపిక చేయాలని మెదక్ జడ్పీ సీఈవో శైలేశ్కు సూచించారు.
ఫిబ్రవరికి 90 శాతం, మార్చి 15 నాటికి వంద శాతం బ్యాంక్ లింకేజీ పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. మండల వారీగా క్రాప్ బుకింగ్ శాతం ఎంత, రసాయనిక ఎరువులు ఏ మోతాదులో అవసరమో కార్యాచరణ రూపొందించుకోవాలని, రైతు వేదికలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చూడాలని జిల్లా వ్యవసాయాధికారికి సూచించారు. 95 దళితబంధు యూనిట్లకు సంబంధించి ఇమేజ్, వివరాలు అప్లోడ్ చేయాలని, 58 పౌల్ట్రీ యూనిట్లకు అవసరమైన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటుకు లబ్ధిదారుల కాంట్రిబ్యూషన్పై అవగాహన కలిగించాలన్నారు.
9 గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న యూనిట్లను పరిశీలించి సక్రమంగా నడుస్తున్నయో లేదో పరిశీలించి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలన్నారు. ఇంతవరకు జిల్లాలో లబ్ధిదారులకు అందజేసిన 1600 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వివరాలను ఆన్లైన్లో పొందుపరచడంతో పాటు ప్రగతిలో, ముగింపు దశలో ఉన్న మరో 1600 ఇండ్ల నిర్మాణాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని డీఎస్వో శ్రీనివాస్కు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.