దుబ్బాక, డిసెంబర్ 29: దుబ్బాక మైనార్టీ గురుకుల పాఠశాల ఆదర్శంగా నిలిచింది. ఇక్కడ విద్యార్థులు విద్యతోపాటు క్రీడలు, ప్రతిభాపాటవాల్లో రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇటీవల ఈ పాఠశాలను సందర్శించిన మైనార్టీ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి షఫీవుల్లా ప్రత్యేకంగా అభినందించారు.
రాష్ట్రంలో ముందంజ…
రాష్ట్రంలో మైనార్టీ పాఠశాలలో దుబ్బాక మైనార్టీ పాఠశాలకు ప్రత్యేకత సాధించింది. దుబ్బాక మైనార్టీ పాఠశాలలో మొత్తం 216 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 2016లో దుబ్బాకలో మైనార్టీ బాయ్స్ (బాలుర) పాఠశాలను ప్రారంభించారు. మొదట 7 వతరగతి వరకు అనంతరం 8, 9, 10 వరకు అప్గ్రేడ్ అవుతూ 2022-23 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ కళాశాల ప్రారంభమయ్యింది. దుబ్బాక మైనార్టీ పాఠశాల రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకత గుర్తింపు ఉంది. పాఠశాల ప్రిన్సిపాల్ విమలాదేవితో పాటు వార్డెన్లు, ఉపాధ్యాయుల సమష్టి కృషితో ప్రత్యేక గుర్తింపు దక్కింది.
ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రథమ సంవత్సరంలో 16 మంది విద్యార్థులు చదువుతున్నారు. విశాలమైన గదులు, క్రీడా ప్రాంగణం, డైనింగ్ హాల్తోపాటు ఆహ్లాదకరంగా ప్రకృతిని తలపించే అందమైన తరగతి గదులున్నాయి. 25 మంది బోధన సిబ్బంది, మరో 16 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఇందులో ఉర్దూ, హిందీ భాషలతో పాటు ఆంగ్లంలో విద్యార్థులు ధారాళంగా మాట్లాడుతుండడం విశేషం. ఇటీవల దుబ్బాక మైనార్టీ గురుకుల పాఠశాలను మైనార్టీ గురుకుల రాష్ట్ర కార్యదర్శి షఫీఉల్లా సందర్శించారు.
చక్కని వసతులు.. కమ్మని భోజనం…
మైనార్టీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏటా ఉచితంగా పుస్తకాలు, నోటు పుస్తకాలు, 3 జతల దుస్తులు, కాస్మోటిక్స్, చలికాలంలో రగ్గులు, మంచాల సౌకార్యం కల్పించింది. ఏఎన్ఎంలు, వ్యాయామ ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు. వైజ్ఞానిక అంశాలపై నిత్యం అవగాహన తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. రుచికరమైన పౌష్టికాహారంతో భోజనం అందిస్తున్నారు.
జాతీయ భావం పెంపొందేలా శిక్షణ…
దుబ్బాక మైనార్టీ గురుకుల పాఠశాలలో పచ్చదనం నెలకొంది. మరో పక్క అందమైన తరగతి గదులు, ఫర్నిచర్, గోడలపై వేసిన పెయింటింగ్ విద్యార్థులకే కాకుండా సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ చదువుకునే విద్యార్థులకు ఇల్లు, తల్లిదండ్రులు గుర్తుకు రాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా జాగ్రత్తపడుతున్నారు ఉపాధ్యాయులు.
ప్రతిభ చాటుతున్న విద్యార్థులు…
10వ తరగతి ఫలితాల్లో ఈ పాఠశాల ముందంజలో నిలువడం అభినందనీయం. ఇక్కడ విద్యాభాస్యం చేసిన విద్యార్థుల్లో ఇప్పటివరకు 8 మందికి సెంట్రల్ ఎసెస్మెంట్లో (మెడికల్, ఇంజినీరింగ్) చదువుకునే అవకాశం దక్కింది. మరో 16 మంది పాలిటెక్నిక్ విద్యకు ఎంపికయ్యారు. ఓ విద్యార్థి కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు, మరో విద్యార్థి పుట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు.
మైనార్టీలకు గుణాత్మక విద్య తెలంగాణలోనే…
మట్టిలో మణిక్యాలను వెలికి తీసేందుకు మైనార్టీ పాఠశాలలు ఎంతగానో దోహదపడుతున్నాయి. రాష్ట్రంలో దుబ్బాక మైనార్టీ పాఠశాల ముందంజలో ఉండటం సంతోషంగా ఉంది. ఇందుకు ఉపాధ్యాయులు, ఇక్కడ పని చేస్తున్న ప్రతి ఒక్కరి కృషి ఉంది. విద్యార్థులకు సులభ పద్ధతిలో బోధిస్తూ చదువంటే ఇష్టం కలిగేలా ఉపాధ్యాయులు కృషి చేయడం అభినందనీయం.
– జి.విమల, ప్రిన్సిపాల్,దుబ్బాక మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్
ఇక్కడ చదువుకోవడం నా అదృష్టం..
మాది నిజామాబాద్. జిల్లాకేంద్రంలోనే మా ఇల్లు. వంద కిలో మీటర్లకు పైగా దూరంలో ఉన్న దుబ్బాకలో చదువుకుంటున్నా. ఇక్కడ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మమ్మల్ని కన్న బిడ్డల్లా చూసుకుంటారు. ఇక్కడ చదువుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. మాది చాలా పేద కుటుంబం. మంచిగా చదివి, ప్రభుత్వ ఉద్యోగం సాధించి, తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటా.
– ఇర్ఫాన్, 10వ తరగతి విద్యార్థి
మాకు ఇల్లు గుర్తు రావటం లేదు…
నాకు దుబ్బాక మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకునే అవకాశం లభించటం సంతోషంగా ఉంది. మేం రెడ్డిలం అయినా పేద కుటుంబం. ప్రైవేటు పాఠశాలలో చదువుకునే స్తోమత లేక ఇక్కడ చదువుకుంటున్నాం. ఇక్కడ కులమతాలకు అతీతంగా విద్యాబోధన చేస్తుండడం సంతోషంగా ఉంది. ఇక్కడి వాతావరణంతో మాకు ఇల్లు గుర్తు రావటం లేదు.
– భువన్, 10వ తరగతి విద్యార్థి