దుబ్బాక, సెప్టెంబర్ 12: ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే.. ‘తెలంగాణ ’ రాష్ట్రం ఏర్పడితే దుబ్బాక గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మారుతుందన్నారు. ఆయన చెప్పినట్లుగానే మల్లన్నసాగర్తో దుబ్బాక నియోజకవర్గం రూపురేఖలే మారిపోయాయి. మల్లన్నసాగర్ నుంచి నియోజకవర్గంలో రైతులకు సాగు నీరు సరఫరా చేసి, నీటి కష్టాలను శాశ్వతంగా తీర్చారు. వానకాలంలో జోరుగా వానలు కురిస్తే తప్ప ప్రవహించని కూడవెల్లి వాగు రెండేండ్లుగా మండుటెండల్లో సైతం జలకళను సంతరించుకున్నది. కూడవెల్లి వాగుతో పాటు చెరువు, కుంటల్లో జలాలను చూసి అన్నదాతలు ఉప్పొంగిపోతున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి దుబ్బాక నియోజకవర్గాన్ని మల్లన్నసాగర్తో సస్యశ్యామలం చేశారని సంబురపడిపోతున్నారు. సమైక్యాంధ్ర పాలనలో దుబ్బాక నియోజకవర్గ ప్రజలు తాగు, సాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకవైపు కోతల కరెంట్ మరోవైపు అడుగంటిన భూగర్భజలాలతో వ్యవసాయం ఇబ్బందికరంగా ఉండేది. సీఎం కేసీఆర్ సర్కారులో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా దుబ్బాకలో శాశ్వతంగా సాగునీటి సమస్య తీరింది. 2020 యాసంగిలో తొలిసారిగా మల్లన్నసాగర్ నుంచి కూడవెల్లి వాగులోకి సాగునీరు విడుదల చేశారు. నాటి నుంచి నేటి వరకు కూడవెల్లి వాగు జీవనదిలా మారింది.
కూడవెల్లిలో …గోదారమ్మ పరవళ్లు
ఎడారిగా మారిన ‘కూడవెల్లి’వాగులో గోదావరి జలాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ జీవనదిగా మార్చారు. ఎక్కడో పుట్టిన గోదారమ్మ బిరబిరా పారుతూ..దుబ్బాక పుడమితల్లిని ముద్దాడటంతో భూమిపుత్రులు పరవశిస్తున్నారు. మండుటెండల్లో కూడవెల్లి వాగులో జలకళ సంతరించుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ‘12వ ప్యాకేజ్ ’ ద్వారా తొగుట, అప్పనపల్లి, హసన్మీరాపూర్, చెల్లాపూర్, పెద్దగుండవెల్లి, రాజక్కపేట గ్రామాల మీదుగా పక్కనున్న రాజన్నసిరిసిల్ల జిల్లాలోని మానేరులోకి కాల్వల ద్వారా గోదావరి నీటిని విడుదల చేశారు. దీంతో ఆ గ్రామాల్లో చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా గజ్వేల్లోని కొడకండ్ల నుంచి మరోపక్క కూడవెళ్లి వాగులోకి నీరు విడుదల చేస్తున్నారు. గజ్వేల్ నుంచి దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాలతో పాటు పక్క జిల్లా రాజన్న సిరిసిల్లలోని మానేరులోకి నీరు చేరుతుంది. ఇటీవల కురిసిన వర్షాలతో నియోజకవర్గంలోని కూడవెల్లి వాగులోని చెక్ డ్యామ్లు నిండి కనువిందు చేస్తున్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో అత్యంత ప్రధానమైన కూడవెల్లి వాగు శాశ్వత జీవనదిగా మారడంతో వాగు పరీవాహక రైతులతోపాటు నియోజకవర్గ ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
46 కి.మీ..1.27 లక్షల ఎకరాలకు సాగునీరు
54 కిలోమీటర్ల పొడవుతో ఉన్న కూడవెల్లి వాగు జీవనదిగా మారడం. మరోవైపు మల్లన్నసాగర్ 12వ ప్యాకేజీ ప్రధాన కాల్వ నుంచి (దుబ్బాక కెనాల్) ద్వారా దుబ్బాక, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల (ముస్తాబాద్) నియోజకవర్గాల్లో చెరువులు, కుంటలకు సరఫరా చేస్తున్నారు. రెండేండ్లుగా యాసంగి పంటలకు సాగునీరు సరఫరా చేస్తున్నారు. మల్లన్నసాగర్ ప్రధాన కాల్వను 5 భాగాలుగా (చిన్న కాల్వలను) విభజించి, 46 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. గొలుసు కట్టు కాల్వల ద్వారా 93 చెరువులు, కుంటలను నింపడంతోపాటు 1.27 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. తొగుట మండలం ఎల్లారెడ్డిపేట నుంచి బంజేరుపల్లి, మెట్టు, ఘనపూర్, వెంకట్రావ్పేట గ్రామాల నుంచి సిద్దిపేట నియోజకవర్గంలో ఇర్కోడు, తోర్నాల నుంచి దుబ్బాక మండలంలో తిమ్మాపూర్, అప్పనపల్లి, హస్మీరాపూర్, పెద్దగుండవెళ్లి, బల్వంతాపూర్, పద్మశాలి గడ్డ, చెల్లాపూర్, రాజక్కపేట గ్రామాల నుంచి రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం మద్దికుంట, చిప్పలపల్లి, గోపాలపూరం గ్రామాల మీదుగా చివరకు మిడ్మానేరుకు చేరనున్నది. మల్లన్నసాగర్ నుంచి నియోజకవర్గంలోని పలు కాల్వల ద్వారా తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల్లో 66, 423 ఎకరాలకు సాగునీరు అందనుంది. మరో పక్క దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట మండలాలకు కొండపోచమ్మ సాగర్ నుంచి గజ్వేల్ మీదుగా ప్రధాన కాల్వ ద్వారా మరో 60 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల ద్వారా మొత్తం 1.27 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
నీళ్లను చూస్తే చాలా సంతోషంగా ఉంది..
గతంలో కూడవెల్లి వాగులో నీళ్లు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాం. సీఎం కేసీఆర్ దయతో కూడవెల్లి వాగులోకి గోదావరి నీళ్లు వచ్చాయి. ఇక మాకు పండుగే పండుగ. వాగు వద్ద పొలాలకే కాకుండా ఇతర రైతులకు కూడా సాగునీరు అందుతుంది. సాగునీరు పుష్కలంగా ఉండడంతో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు గుంట జాగున్న రైతు కూడా అదృష్టవంతుడిగా మారాడు. సీఎం కేసీఆర్ సర్కారుతోనే రైతులకు మంచి జరుగుతున్నది. ఆయన చల్లగుండాలి. ఆయనే మళ్లీ సీఎంగా రావాలి.
– బాలరాజ్ గౌడ్, ఎనగుర్తి
అపరభగీరథుడు సీఎం కేసీఆర్
దుబ్బాక నియోజకవర్గంలో బీడుభూములను సాగు భూములుగా మార్చిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్. నీళ్లు, నిధు లు, నియామకాల నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి స్వరాష్ట్రం సాధించడమే కాకుండా ఆనాటి నినాదాలను ఆచరణలో చేసి చూపారు. ఆయనొక ఇంజినీరులా ఆలోచించి, భవిష్యత్ తరాలకు నీటి కష్టాలు ఉండకూడదన్న లక్ష్యం తో కాళేశ్వరాన్ని నిర్మించారు. మల్లన్నసాగర్తో దుబ్బాక నియోజకవర్గంలో సాగు నీటి కష్టాలు శాశ్వతంగా పరిష్కారమయ్యాయి. కూడవెల్లి వాగు జీవనదిగా మారడం చాలా సంతోషంగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులతోపాటు అన్ని వార్గల ప్రజలకు ప్రయోజనం చేకూరింది. ఇదంతా సీఎం కేసీఆర్తోనే సాధ్యమైంది.
– కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎంపీ బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు
సాగునీటి కష్టాలు తీర్చిన దేవుడు సీఎం కేసీఆర్
రెండేండ్లుగా ఎండకాలంలో సైతం కూడవెల్లి వాగు పారుతుండడం సంతోషంగా ఉంది. కలలో కూడా ఉహించలేదు. సాగునీటి కష్టాలు తీర్చిన దేవుడు సీఎం కేసీఆర్. ఆయన చలువతోనే కూడవెల్లికి గోదావరి నీళ్లు వచ్చాయి. యాసంగి పంటకు నీళ్ల కష్టం లేకుండా పోయింది. ఎడారిగా ఉండే కూడవెల్లి వాగు రెండేండ్లుగా నదిలా మారి నిత్యం నీటితో కళకళలాడుతున్నది. రైతుల సాగునీటి కష్టాలు తీర్చిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– యాదయ్య, గోసాన్పల్లి