మెదక్, జూలై 3(నమస్తే తెలంగాణ): భూ రీసర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి, భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ డీఎస్ లోకేశ్కుమార్ ఆదేశించారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్శాఖ కమిషనర్, భూ భారతి ప్రాజెక్టు డైరెక్టర్ రాజీవ్గాంధీ హనుమంత్తో కలిసి మెదక్ జిల్లాలో జరుగుతున్న భూ సర్వే అమలు, భూ భారతి, సాదాబైనామా, రెవెన్యూ సదస్సుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 24 గ్రామాలు రీ సర్వేకు ఎంపిక కాగా 7 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి, 18 గ్రామ సభలు నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు.ఆర్డీవోలు, తహసీల్దార్లు భూ సర్వే ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. లైసెన్స్ సర్వేయర్లకు ల్యాండ్ పార్సిల్ మ్యాప్స్(ఎల్పీఎం), భూముల సరిహద్దులు స్పష్టంగా ఉండేందుకు వీలుగా కొత్తగా ల్యాండ్ పార్శల్ మ్యాప్ నంబర్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
గతంలో రికార్డుల్లో ఉన్న వ్యత్యాసాలను సరిచేస్తూ సరిహద్దు వివాదాలు త్వరగా పరిష్కరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 134 గ్రామాల్లో సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. భూ సర్వేలో సరిహద్దుల ఫిక్సింగ్ , ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం సంబంధిత విషయాల్లో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, భూ భారతి ప్రాజెక్టు డైరెక్టర్ రాజీవ్గాంధీ హనుమంత్ మాట్లాడుతూ.. సాదాబైనామా, భూ భారతి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. సర్వే నిర్వహణ పారదర్శకంగా జరగాలన్నారు. మెదక్ జిల్లాలో రీ సర్వే నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. సమీక్షలో మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్, జిల్లా ల్యాండ్ సర్వేయర్ ఏడీ కిషన్, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.