అందోల్, జనవరి 29: ఇండ్లులేని నిరుపేదలకు ఇండ్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఆదివారం అందోల్ క్యాంప్ కార్యాలయంలో అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలోని లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో 573 ఇండ్లను నిర్మించి అర్హులైన నిరుపేదలకు ఎంపిక చేసి లాటరీ పద్ధతిలో ఇండ్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులను మాత్రమే అధికారులు ఎంపిక చేశారని చెప్పారు.
కానీ, కాంగ్రెస్ నాయకులు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ దీనిని రాజకీయం చేసి పేదలకు అన్యాయం చేసేందుకు యత్నించారని కోర్టుకు సైతం వెళ్లినప్పటికీ అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లలో ఎంత అవినీతి జరిగిందో అందరికీ తెలుసని, ఒకటి, రెండు ఇండ్లు సైతం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకే కేటాయించి అంతులేనిఅవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.
కోర్టు తీర్పును గౌరవించి 8 మంది లబ్ధిదారుల ఇండ్లను రిజర్వులో పెట్టామని, మిగతా 565 మందికి ఇండ్ల పట్టాలు అందజేశామని తెలిపారు. త్వరలో మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా పండుగ వాతావరణంలో ఇండ్ల ప్రారంభోత్సవాలు జరుపుకొంటామని ఎమ్మెల్యే తెలిపారు. అన్నివర్గాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని దీనిని గుర్తించి ప్రతిపక్షాలు అభివృద్ధికి సహకరించాలి తప్ప అడ్డుపడకూడదని హితవు పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, డిప్యూటీ తహసీల్దార్ మధుకర్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.