సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 11: బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల కోసం భూ సేకరణను వేగవంతం చేయాలని అధికారులను సంగారెడ్డి కలెక్టర్ శరత్కుమార్ ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి భూ సేకరణ, పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆర్డీవోలు, తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, పంప్హౌస్ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఎస్ఈ మురళీధర్కు సూచించారు.
జిల్లాలో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పనులకు సంబంధించిన భూ సేకరణ వేగవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి బసవేశ్వర, సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు భూసేకరణ, పనుల పురోగతిపై నీటి పారుదల శాఖ అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతలకు ఇప్పటివరకు సేకరించిన భూమి, ఇంకా సేకరించాల్సిన భూ వివరాలను ఆయా రెవెన్యూ డివిజనల్ అధికారులతో ఆరా తీశారు. బసవేశ్వరకు సంబంధించి బోరంచ, రాంతీర్థ్లో పంప్ హౌస్లు నిర్మాణానికి భూసేకరణకు గాను బోరంచలో భూసేకరణ పూర్తయిందని, రాంతీర్థ్లో పూర్తి కావచ్చిందని నారాయణఖేడ్ ఆర్డీవో కలెక్టర్కు వివరించారు. సంగమేశ్వరకు సంబంధించి హోతి(కె) రాంతీర్థ్, చిన్న చెల్మెడలో భూమి సేకరిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 20లోగా భూ సేకరణ పూర్తి చేయాలి
ఈ నెల 20లోగా భూ సేకరణ పూర్తి చేసి, నీటి పారుదల శాఖకు స్వాధీనం చేయాలని ఆర్డీవోలకు సూచించారు. ఆయా మండలాల తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత సమయంలోగా భూ సేకరణ పూర్తి చేయాలన్నారు. భూమి స్వాధీనం చేసిన వెంటనే ముందుగా పంప్ హౌస్ల పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ ఎస్ఈ మురళీధర్కు సూచించారు. సమావేశంలో నీటి పారుదల శాఖ ఎస్ఈ మురళీధర్, జహీరాబాద్, నారాయణఖేడ్ ఈఈలు విజయ్ కుమార్, భీమ్, డీఈలు జలందర్, రాజ్యలక్ష్మి, ఉదయ భాస్కర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు నగేశ్, రమేశ్ బాబు, అంబదాస్, ల్యాండ్ సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.