సంగారెడ్డి, ఫిబ్రవరి 2: సమాజానికి చీడ పురుగులా మారిన మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమిష్టి కృషి చేసి యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాలకు యువత బానిస కాకుండా అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా కళాశాలలు, పాఠశాల విద్యార్థి దశ నుంచి యువత మత్తుకు బానిసగా మారుతున్నదని మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో బాధ్యతగా పని చేయాలన్నారు. వాటిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు.
– ఎస్పీ చెన్నూరి రూపేశ్
జిల్లాలో మాదకద్రవ్యాల నిరోధానికి పోలీస్శాఖ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని, గంజాయి సాగు, వినియోగం, రవాణాకు సంబంధించి క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని వ్యవసాయ, అటవీ తదితర శాఖల అధికారులను ఎస్పీ చెన్నూరి రూపేశ్ కోరారు. గంజాయి సాగు చేయొద్దని ఏఈవోలతో రైతులకు అవగాహన కల్పించాలని, సాగుచేసే వారిపై కేసులు నమోదు చేసి వారి ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరికలు జారీ చేయాలన్నారు. జిల్లాలో జిన్నారం పరిధిలో ఆల్ఫాజోలం తయారీ చేస్తున్న ఒక పరిశ్రమను గుర్తించి మూసి వేశామన్నారు.
ఎక్సైజ్ తదితర శాఖలకు పోలీసుశాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గాయత్రీదేవి, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ వాణి, ఎంఎన్ఆర్ వైద్య కళాశాల ప్రతినిధులు, వ్యవసాయ, రవాణా, విద్య, ఎక్సైజ్, అటవీ తదితరశాఖల అధికారులు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, డీఎస్పీలు, ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.