వెల్దుర్తి, జూన్ 15 : జిల్లావ్యాప్తంగా ‘మనఊరు-మన బడి’లో చేపట్టిన రూ.30 లక్షల విలువైన పనులను పూర్తి చే యాలని కలెక్టర్ ఆదేశించారని, అందుకు అనుగుణంగా పను లు జరుగుతున్నాయని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ తెలిపారు. గురువారం వెల్దుర్తి మండలం కుకునూర్లోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో ‘మనఊరు-మనబడి’ పనులను డీఈవో పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. ఉన్నత పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల నిర్మాణాలను పరిశీలించి, విద్యార్థుల చేరిక, బడిబాటపై ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థుల అడ్మిషన్లపై నిర్లక్ష్యం వహించరాదని, లక్ష్యానికి అనుగుణంగా అడ్మిషన్లు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. జిల్లాలో 313 పాఠశాలలో ‘మనఊరు-మనబడి’ పనులు జరుగుతున్నాయన్నా రు. 70 పాఠశాలల్లో రూ. 30 లక్షల కంటే అధిక నిధులు ఖర్చ య్యే పనులకు టెండర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో నామినేషన్ పద్ధ్దతిలో గత నెలలో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.
రూ. 30లక్షలలోపు ఖర్చు చేసే పనులను నెలాఖరు లోగా పూర్తి చేస్తామన్నారు. అందుకు అనుగుణంగా నిరంత రం పనులను పర్యవేక్షిస్తున్నట్లు డీఈవో తెలిపారు. 85 పాఠశాలల్లో పనులు చివరి దశకు చేరాయని, ఈ నెల 20న నిర్వహించే విద్యాదినోత్సవంలో జిల్లాలోని 15 పాఠశాలలను ప్రా రంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో 7 వేల మంది విద్యార్థుల అడ్మిషన్లు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 5 వేల మంది పాఠశాలల్లో చేరారని, మరో 2 వేల మంది చేరా ల్సి ఉందన్నారు. యూనిఫాం, పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో మండలాలకు చేరుకున్నాయని, వాటిని పాఠశాలలకు తరలి స్తున్నామని, త్వరలోనే విద్యార్థులకు అందజేస్తామన్నారు. జిల్లాకు 2.50 లక్షల బుక్స్ రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 30 వేల నోట్బుక్స్ వచ్చాయని, మరో నాలుగైదు రోజులలో పూర్తిస్థాయిలో వస్తాయని వివరించారు. 1 నుంచి 5 తరగతుల వరకు వర్క్బుక్స్, 6 నుంచి 10 తరగతులకు నోట్బుక్స్ ఇవ్వనున్నట్లు డీఈవో తెలిపారు. డీఈవో వెంట నోడల్ అధికారి సాంబయ్యతోపాటు ఉపాధ్యాయులు ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాలకు పాఠ్యపుస్తకాలు వచ్చాయని, వాటిని విద్యార్థులకు పంపిణీ చేస్తామని ఎంఈవో నీలకంఠం తెలి పారు. వెల్దుర్తిలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ పాఠ్యపుస్తకాలు రెండు దఫాలుగా ఎమ్మార్సీ కార్యాలయానికి వచ్చాయని, వాటిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
కొల్చారం, జూన్ 15 : మండల పరిధిలోని పోతంశెట్పల్లి హైస్కూల్ను ఎంఈవో నీలకంఠం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి బడిబాట కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, ఐఎఫ్పీ బోర్డులను సక్రమంగా వినియోగించాలని సూచించారు.