నారాయణఖేడ్, జూన్ 13: తల్లీబిడ్డలకు మరింత మెరుగైన పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నిరు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నారాయణఖేడ్లోని రెహమాన్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్లలో మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ప్రభుత్వం మహిళలకు భద్రతకు షీటీమ్లను ఏర్పాటు చేసిందన్నారు.
ఆడపిల్లల పెండ్లికి రూ.లక్షా 116లు అందజేసే పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. పుట్టబోయే బిడ్డలో పోషకాహారలోపాన్ని నివారించేందుకు ఆరోగ్య లక్ష్మి పథకంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పోషకాహారం కోసం రూ.18.79 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా కేవలం రూ.30 కోట్లు మాత్రమే రుణ సహాయం అందగా, 2014 నుంచి ఇప్పటివరకు రూ.195 కోట్ల రుణాలందించి మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించినట్లు తెలిపారు.
జిల్లాలో1.64 లక్షల మందికి ఆసరా పింఛన్లు
జిల్లాలో మొత్తం 1.64 లక్షల మందికి వివిధ రకాల ఆసరా పింఛన్లు అందుతుండగా, ప్రతి నెలా రూ.39 కోట్లు పింఛన్దారుల ఖాతాల్లో జమ అవుతున్నాయన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా మాతా శిశు మరణాల రేటు చాలా వరకు తగ్గిపోయిందన్నారు. న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పురుషులతో సమానంగా రాణించే సత్తా మహిళల్లో ఉందన్నారు. ఈ సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల బాధ్యులు, అంగన్వాడ టీచర్లు, ఆశా కార్యకర్తలను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్, ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, డీఎస్పీ వెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రుబీనాబేగం నజీబ్, ఎంపీపీలు చాందిబాయి చౌహాన్, మోతీబాయి, జడ్పీటీసీలు లక్ష్మీబాయి రవీందర్నాయక్, రాజు రాథోడ్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు జ్యోతి, సీడీపీవో సుజాత తదితరులు పాల్గొన్నారు.