నర్సాపూర్, జనవరి 28 : గొప్పగొప్ప మేధావులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్ మండలంలోని చిప్పల్తుర్తి గ్రామం లో గ్రామానికి చెందిన చంద్రశేఖర్ సహకారంతో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్కు సంబంధించిన పుస్తకాలను శనివారం విద్యార్థులకు ఎమ్మెల్యే మదన్రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారు ఇంజినీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, గొప్ప మేధావులు అయ్యారని గుర్తు చేశారు. పాఠశాల విద్యార్థులకు అంబేద్కర్ పుస్తకాలను పంపిణీ చేయడం మంచి కార్యక్రమమని కొనియాడారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి పాఠశాల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అంబేద్కర్ జీవిత చరిత్రను విద్యార్థులు తెలుసుకొని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రతిభ కు పేదరికం అడ్డుకాదన్నారు. చిప్పల్తుర్తి గ్రామంలోని దళితులకు దళితబంధు పథకం అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, జడ్పీటీసీ బాబ్యానాయక్, ఏఎంసీ చైర్మన్ హబీబ్ఖాన్, డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ సంధ్యారాణీఛత్రునాయక్, సర్పంచ్ శ్యామలాలక్ష్మణ్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు అశోక్గౌడ్, జక్కపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉన్నతస్థాయికి చేరాలి
జూనియర్ సివిల్ జడ్జి అనిత
విద్యార్థులు అంకిత భావంతో చదివి గొప్పగొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని జూనియర్ సివిల్ జడ్జి అనిత పేర్కొన్నారు. నర్సాపూర్ మండలం నారాయణపూర్ గ్రామ సమీపంలో ఉన్న గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పాఠశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ను సందర్శించి హాస్టల్ని పరిశీలించి వంట గదిలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, బాధ్యతలు, విధులపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని సూచించారు. విద్యార్థులకు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు 100 నంబర్ లేదా లీగల్ సర్వీస్ కమిటీ ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏజీపీ సత్యనారాయణ, న్యాయవాదులు స్వరూపరాణి, ప్రకాశ్, సుధాకర్, రాజునాయక్, మధుశ్రీ, ప్రిన్సిపాల్ మమత పాల్గొన్నారు.