కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందాయి. ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజల మధ్యకు తీసుకుపోవాలి… పార్టీలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరం సైనికుల్లా పనిచేయాలి.. బీజేపీ నాయకుల కుట్రలను తిప్పికొట్టాలి’… అంటూ నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులను కార్యోణ్ముఖులను చేశారు. ‘ఎన్నికల నగారా మోగినట్టేనని, సార్వత్రిక ఎలక్షన్లు ఈ ఏడాదిలోనే నిర్వహించనున్నందున మనం కూడా సమాయత్తం కావాల్సిందే’… అంటూ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల మెదక్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ చిలిపిచెడ్ మండల ఆత్మీయ సమ్మేళనం హత్నూర మండల కేంద్రంలోని సిరిపుర ఫంక్షన్హాలులో ఆదివారం జరగగా, వీరిద్దరూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పార్టీ మండల అధ్యక్షుడు అశోక్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈసమ్మేళనంలో సీఎం పంపిన సందేశాన్ని జగ్గంపేట సర్పంచ్ మాంతప్ప చదివి వినిపించారు. రాష్ర్టాభివృద్ధికి సీఎం కేసీఆర్ కంకణబద్ధులై చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపైనే ఉందంటూ వక్తలు దిశానిర్దేశం చేశారు. చిలిపిచెడ్ మండలవ్యాప్తంగా ఉన్న 19 గ్రామ పంచాయతీల నుంచి పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఈ ప్రాంతం గులాబీమయమైంది.
– చిలిపిచెడ్, ఏప్రిల్ 16
హత్నూర మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ చిలిపిచెడ్ మండల ఆత్మీయ సమ్మేళనంలో ‘నమస్తే తెలంగాణ’ పత్రికపై పొగడ్తల వర్షం కురిసింది. వేదికపై ఆసీనులైన అతిథులు రాష్ట్ర అభివృద్ధిపై విశ్లేషణాత్మక కథనాలు ప్రచురిస్తున్న తీరు అభినందనీయమంటూ పత్రికను వేనోళ్ల పొగిడారు. ముఖ్యంగా పత్రిక ఇటీవల ఆరంభించిన ‘నాడు-నేడు’ శీర్షికపై చర్చించారు. కొన్ని న్యూస్ క్లిప్పింగ్స్ను చూస్తూ నాటికి, నేటికి ఉన్న తేడాలను బేరీజు వేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దుస్థితిని, స్వరాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులతో మారిన రూపురేఖలను ‘నాడు-నేడు’ శీర్షిక పాఠకుల కళ్లకు కడుతున్నదంటూ జేజేలు పలికారు!
చిలిపిచెడ్, ఏప్రిల్ 16: ‘కార్యకర్తలే బలం.. ప్రజలే నా బలగం.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందాయి. వాటిని కార్యకర్తలు ఇంటింటికీ తీసుకుపోయి ప్రచారం చేయాలి. బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి’… అని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ చిలిపిచెడ్ మండల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్రెడ్డి అధ్యక్షతన జరిగింది. హత్నూర మండలంలోని సిరిపుర ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో సీఎం పంపిన సందేశాన్ని జగ్గంపేట సర్పంచ్ మాంతప్ప సభలో చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి చిలిపిచెడ్ మండలవ్యాప్తంగా ఉన్న 19 గ్రామ పంచాయతీల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ సమ్మేళనాల మెదక్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ చైర్మన్ ఉమ్మన్నగారి దేవేందర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా 52 కిలోమీటర్ల మేర మంజీర ప్రవహిస్తున్నదని, ఈ నదిపై హత్నూర, చిలిపిచెడ్, కొల్చారం మండలాల్లో 14 చెక్డ్యాంలు మంజూరు చేయించినట్లు చెప్పారు. ఇప్పటికే 11 చెక్డ్యాంలు నిర్మాణం పూర్తయి మండుటెండల్లో సైతం నిండుగా మత్తడి దుంకుతుండడంతో ఈ ప్రాంతంలో బంగారు పంటలు పండుతున్నాయన్నారు. మరో మూడు చెక్డ్యాంలు మే నేలలో నిర్మాణం ప్రారంభించి జూలై వరకు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. చెక్డ్యాంల నిర్మాణం పూర్తయిన తర్వాత నియోజకవర్గంలోని అన్ని చెరువు, కుంటలు నింపి ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తామని చెప్పారు.
బంగారు పంటలు పండుతుండడంతో సీఎం కేసీఆర్ పాలనలో రైతులు రాజుగా మారుతున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటైతే కరెంటు ఉండదని, దీపాలు పెట్టుకోవాల్సి వస్తుందని హేళన చేసిన పార్టీల నోరు మూయించేలా 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాకముందు ఏ గ్రామానికి వెళ్లినా కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు దర్శనమిచ్చేవని, పంటలు ఎండిపోయేవన్నారు. ఇప్పుడు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. రోహిణి కార్తె వస్తే పంట పెట్టుబడి లేక రైతు గుండె దడదడలాడేదని, ఎట్ల నాటేసుకుంటమో… ఏదైనా బంగారం కుదవ పెట్టుకునేటోళ్లు, షావుకార్ల చుట్టూ తిరిగేటోళ్లని గుర్తుచేశారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ బాగా ఆలోచించి పెట్టుబడి కోసం రైతుబంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. రైతు చనిపోతే రూ.ఐదు లక్షలు వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లో పడుతున్నాయన్నారు. పంట దళారుల పాలు కాకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. మిషన్ కాకతీయతో చెరువు, కుంటలను అపురూపంగా తీర్చిదిద్దుకున్నామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో అన్ని వర్గాల ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.1,00,116 ఇస్తున్నామన్నారు. 24 గంటల కరెంటు ఇస్తుండడంతో ఓర్వ లేని కేంద్రం ఉచిత కరెంటును నిలిపివేస్తే రాష్ర్టానికి రూ.30 వేల కోట్లు ఇస్తానని చెప్పినా వినకుండా సీఎంకేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఉచిత కరెంటు ఇస్తూ కేంద్రం నిర్ణయాన్ని తిరస్కరించినట్లు తెలిపారు. మరో రెండు సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తయితే నియోజకవర్గంలోని ప్రతి చెరువు నింపడం ద్వారా ప్రతి ఎకరాకూ నీరందుతున్నదన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం నర్సాపూర్ తాలూకాను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేశామని, తన సొంత మండలమైన కౌడిపల్లి మండలం నుంచి చిలిపిచెడ్ మండలాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలోనే అన్నింటికి ప్రభుత్వ భవనాలు మంజూరు చేస్తామని హామీ తెలిపారు. ప్రతి ఒక్కరు ఆత్మగౌరవంతో జీవించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వృద్ధులకు నెలకు రూ.2016 పింఛన్ ఇస్తున్నారన్నారు. వచ్చే ఇరవై రోజుల్లో ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షలు ఇవ్వనున్నామని చెప్పారు.
సమ్మేళనంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్ అహ్మద్, ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ విశ్వంబరస్వామి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు లక్ష్మీదుర్గారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు బేస్త లక్ష్మణ్, సొసైటీ ఇన్చార్జి చైర్మన్ రాంచంద్రారెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ రాజిరెడ్డి, మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు షఫీ, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యుడు సయ్యద్ హుస్సేన్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సుభాష్రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు సర్పంచ్లు గోపాల్రెడ్డి, పరశురాంరెడ్డి, కవిత, ముకుందరెడ్డి, ఆత్మ డైరెక్టర్ విజయమ్మ, రాజేందర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వాకిటి శశిధర్రెడ్డి పాల్గొన్నారు.
ఆత్మీయ సమ్మేళనంలో అంబలి పంపిణీ
తెలంగాణ ప్రజలు ఎండాకాలం ప్రీతికరంగా అంబలిని సేవిస్తారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అజ్జమర్రి సర్పంచ్ పట్లోల్ల పరశురాంరెడ్డి సొంతంగా అంబలిని పంపిణీ చేయడంతో సభకువచ్చిన ముఖ్య అతిథులతోపాటు సభికులంతా అంబలిని సేవించారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సిరిపురలోని ఫంక్షన్హాల్లో సమ్మేళనం నిర్వహించారు. చిలిపిచెడ్ మండల వ్యాప్తంగా పందొమ్మిది గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా సభకు తరలివచ్చారు.
నగారా మోగినట్టే.. సమాయత్తం కావాలి
ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. ఎన్నికల నగారా మోగినట్టే, అందుకు కార్యకర్తలు సమాయాత్తం కావాలి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు మండలాల వారీగా ఆత్మీ య సమ్మేళనాలను నిర్వహిస్తున్నాం. 20 భవనాలున్న సెక్రటేరియట్ను సీఎం కేసీఆర్ రూ.500 కోట్లతో అద్భుతమైన కొత్త భవనాన్ని అన్ని శాఖల మంత్రులు ఉండేలా నిర్మించారు. హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రజానీకం గర్వించేలా తెలంగాణ అమరుల స్తూపం నిర్మించారు. దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఈ నెల 14న ప్రారంభించారు.. ఇది తెలంగాణకే గర్వకారణం. అద్భుత శిల్ప కళానైపుణ్యతతో యాదాద్రిని నిర్మించారు. 60 ఏండ్ల కాంగ్రెస్, 20 ఏండ్ల టీడీపీ పాలనలో అప్పటి పాలకులకు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదు? సిద్దిపేట ఎమ్మెల్యేగా, మెదక్ ఎంపీగా, కేంద్రం మంత్రిగా పనిచేసిన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే మదనన్నకు ప్రాధాన్యత ఇస్తారు. నర్సాపూర్ నియోజకవరంలో ప్రతి ఒక్కరి గుండెల్లో మదనన్న ఉన్నాడు. మదనన్నను లక్ష మెజార్టీతో గెలిపించాలి.
– బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల మెదక్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం
దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామి
ఉద్యమ నాయకుడే తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ ఉండడం మన అదృష్టం. భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నది. అరవై ఏండ్లు పాలించిన పార్టీలు చేయలేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల చేసి చూపారు. పార్టీని విస్తరించి, దేశంలో అధికారం చేపట్టేందుకు భారత రాష్ట్ర సమితిగా మార్పు చెందిన గులాబీ జెండాను ప్రజలు మరోమారు ఆదరిస్తారు.
– ఉమ్మన్నగారి దేవేందర్రెడ్డి, రాష్ట్ర కార్మిక సంక్షేమశాఖ చైర్మన్
ఎమ్మెల్యే కృషి మరువలేనిది
ఎమ్మెల్యే సొంత మండలమైన కౌడిపల్లి మండలం నుంచి చిలిపిచెడ్ మండలాన్ని కొత్త మండలంగా ఏర్పా టు చేయడంలో ఎమ్మెల్యే కృషి మరువలేనిది. కొత్త మండలంగా ఏర్పాటు చేయడంతోపాటు చిలిపిచెడ్ మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. మంజీరానదిపై నాలుగు చెక్డ్యాంలు మంజూరు చేయ గా అజ్జమర్రి, చిట్కుల్ చెక్డ్యాంలు పూర్తయి రైతులకు ఉపయోగంలోకి రావడం చిలిపిచెడ్ మండల ప్రజల అదృష్టం.
– చంద్రాగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
భారీ మెజార్టీతో గెలిపిస్తాం
ప్రజలను తన సొంత బిడ్డలా చూసుకునే ఎమ్మెల్యే మదన్రెడ్డి నిస్వార్థ నాయకులు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మహనీయుడు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రతి ఒక్కరి మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేస్తున్న మదన్రెడ్డిని ఈసారి భారీ మెజార్టీతో గెలిపిస్తాం.
– బేస్త లక్ష్మణ్, బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు
ప్రభుత్వ కార్యక్రమాలకు ఇంటింటికీ వివరించాలి
ఆత్మీయ సమ్మేళనం అంటే ఏందని చాలా మందిలో ఉంది. కానీ, ఇక్కడికి వచ్చాక ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రతి నాయకుడు, కార్యకర్త చర్చించుకుని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకుపోవాలి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఇంటింటికీ నల్లా ద్వారా నీళ్లు ఇవ్వడం ఇలా ప్రతి ఇల్లు లబ్ధి పొందుతున్నది. ఎమ్మెల్యే మదన్రెడ్డి అంటే చిలిపిచెడ్ మండల ప్రజలకు ఎంతో అభిమానం. ఆయన్ను దేవుడిలా పూజిస్తారు.
– లక్ష్మీదుర్గారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు