సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 22:ధరణి మాడ్యూల్స్ లో దరఖాస్తులను ప్రాపర్గా అప్లోడ్ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు (వీఎల్ఈ) సూచించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ధరణి మాడ్యూల్స్లో ఏఏ ఆప్షన్లు ఉన్నాయి, ఆయా ఆప్షన్లకు సంబంధించి తమ దరఖాస్తుతో పాటు అప్లోడ్ చేయాల్సిన పత్రాలు తదితర అంశాలపై వీఎల్ఈలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ పేదలు, చదువు రానివారు, తెలియని వారికి ధరణిలో ఏవిధంగా అప్లోడ్ చేసుకోవాలో తెలియక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. వారికి మీసేవ ఆపరేటర్లు సహకరించి అన్ని వివరాలతో అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాలని సూచించారు. డేటా ఎంట్రీ అప్రూవల్ ఆఫ్ అప్లికేషన్కు మీ సేవ వీఎల్ఈలే కీలక పాత్రదారులని చెప్పారు. చట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు. సక్సెషన్లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలన్నారు. తప్పు చేస్తే శిక్షార్హులవుతారని స్పష్టంచేశారు. ఆధార్ అప్డేట్ కు సంబంధించిన పోస్టర్ను ఆయన విడుదల చేశారు.
ఆధార్కార్డు అప్డేట్ చేసుకోవాలి
2010 నుంచి 2016 మధ్య ఆధార్ పొందిన వారందరూ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని వీరారెడ్డి స్పష్టం చేశారు. ఆధార్ కేంద్రంలో లేదా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చన్నారు. రుజువులతో సహా మరోసారి అప్డేట్ చేసుకోవాలన్నారు. ఇందుకు ఒరిజినల్ చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువు, అడ్రస్ అప్డేట్ డాక్యుమెంట్ల ఫ్రూఫ్ తీసుకెళ్లాలని, నమోదు ఫారంలో వివరాలు ఖచ్చితంగా పూరించాలని వివరించారు. ఈ విషయమై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మీసేవ ఆపరేటర్లకు సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు నగేశ్, రమేశ్బాబు, అంబాదాస్, కలెక్టరేట్ ఏవో మహిపాల్రెడ్డి, తహసీల్దార్లు, మీసేవ జిల్లా కోఆర్డినేటర్ ప్రదీప్, కేంద్రాల నిర్వాహకులు, ఎన్ఐసీ ఈడీఎం ఉదయ్ పాల్గొన్నారు.