Medaram Jatara | హుస్నాబాద్, జనవరి 31: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మేడారం జాతర షురువైంది. వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారికి ఇష్టమైన ప్రతి బుధ, శుక్రవారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి హుస్నాబాద్ పట్టణంలోని పలు దుకాణాల వద్ద ఎత్తు బంగారం (అమ్మవార్లకు బెల్లం నైవేద్యం) ఇస్తున్నారు. దీంతో ఆయా దుకాణాల వద్ద భక్తుల సందడి నెలకొంటున్నది. అమ్మవారికి మొక్కిన విధంగా భార్యాభర్తలు కలిసి ఎత్తుబంగారం ఇవ్వడం, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఎత్తుబంగారం ఇస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
కోరిన కోర్కెలు తీరిన భక్తులు ఎత్తు బంగారం ఇచ్చి నేరుగా మేడారం జాతరకు వెళ్లి అమ్మవార్ల గద్దెల వద్ద బెల్లం నైవేద్యం సమర్పించి మొక్కులు అప్పజెప్పుతారు. ప్రతి ఫిబ్రవరిలో రెండేండ్లకోసారి వచ్చేజాతర ఈసారి నెల రోజుల ముందు నుంచే భక్తులు మేడారానికి వెళ్తున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు మేడారంలో జాతర జరుగుతుంది. అప్పుడు భక్తుల రద్దీ అధికంగా ఉంటున్నందున ముందుగానే మేడారానికి వెళ్లి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర సందడి నెలకొనడంతో హుస్నాబాద్లోని ఆయా దుకాణాల్లో బెల్లం కొనుగోళ్లు పెరిగాయి. జాతర సమయం వరకు ఎత్తు బంగారం ఇచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుందని, అందుకు తగ్గట్టుగానే తాము బెల్లం స్టాకు తెప్పిస్తున్నామని దుకాణాదారులు చెబుతున్నారు.