చేర్యాల, మార్చి 5: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది.ఏడో ఆదివారానికి కరీంనగర్, వరంగల్ తదితర పూర్వపు జిల్లాల నుంచి సుమారు 35 వేల మంది భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ట్రాక్టర్లు, ఆటోలతో పాటు ఆర్టీసీ బస్సుల్లో భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో క్షేత్రంలోని పార్కింగ్ స్థలాలు నిండిపోయాయి. స్వామి వారి క్షేత్రానికి వచ్చిన భక్తులు ‘మల్లన్న స్వామి…మమ్మేలు స్వామి’ అని చేసిన నినాదాలతో స్వామివారి ఆలయం మార్మోగింది. మల్లన్న దర్శనంతో భక్తులు పులకించిపోయారు.
శనివారం రాత్రి నుంచే మొదలైన భక్తుల రాక ఆదివారం సాయంత్రం వరకు కొనసాగింది. భక్తులు కోనేటిలో పవిత్ర స్నానాలు ఆచరించి క్యూ ద్వారా స్వామివారి ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు.భక్తులు అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల వసతి కోసం ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఈవో ఎ.బాలాజీ కృషి చేశారు. కార్యక్రమాల్లో ఆలయ పాలక మండలి సభ్యులు నర్ర రఘువీరారెడ్డి, కొంగరి గిరిధర్, కాసర్ల కనకరాజు, సాయియాదవ్, చెట్కూరి తిరుపతి, సూపరింటెండెంట్లు నీల శేఖర్, శ్రీనివాస్శర్మ, ఆలయ స్థానాచార్యుడు పడిగన్నగారి మల్లేశం, ప్రధానార్చకుడు మహదేవుడి మల్లికార్జున్, అర్చకులు, ఒగ్గు పూజారులు, సిబ్బంది భక్తులకు సేవలందించారు.
పోలీసుల బందోబస్తు
క్షేత్రస్థాయిలో పర్యటించిన అడిషనల్ డీసీపీ (అడ్మిన్) మహేందర్
కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి పట్నం వారం సందర్భంగా మల్లన్న క్షేత్రంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) ఎస్.మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు నిర్వహించారు. స్వామివారి క్షేత్రంలోని పార్కింగ్ ప్రదేశాలు, శీఘ్రదర్శనం, వీఐపీ దర్శనం, సాధారణ దర్శనం ప్రదేశాలతో పాటు దేవాలయ ఆవరణను పరిశీలించి అధికారులు, సిబ్బందికి కమ్యూనికేషన్స్ సెట్ ద్వారా బందోబస్తును పర్యవేక్షిస్తూ సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడో ఆదివారం సందర్భంగా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సీసీ కెమెరాల ద్వారా కొమురవెల్లి పోలీస్ స్టేషన్ నుంచి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని, భక్తులకు ఏమైనా ఇబ్బందులుంటే పోలీస్ కంట్రోల్ రూమ్కు రావాలన్నారు.దర్శనానికి వచ్చే భక్తులు పోలీసుల సలహాలు సూచనలు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవాలన్నారు.గజ్వేల్ ఏసీపీ రమేశ్, చేర్యాల సీఐ సత్యనారాయణరెడ్డి,కొమురవెల్లి, చేర్యాల, మద్దూరు ఎస్సైలు చంద్రమోహన్, భాస్కర్రెడ్డి, నారాయణ, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
మల్లన్న సన్నిధిలో ప్రముఖులు
ఏడుఆదివారం సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్కుమార్, జనగామ, మెట్పల్లి ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాల్రాజు, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ మల్లన్నను దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన నేతలకు ఆలయ చైర్మన్ గీస భిక్షపతి,ఈవోఎ.బాలాజీ ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆలయంలో వినోద్కుమార్, ముత్తిరెడ్డి పూజలు చేశారు.