ఝరాసంగం, ఫిబ్రవరి 7: దుర్వాసన నుంచి భక్తులకు విముక్తి కలిగింది. కేతకీ ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూస్తామని మండల ప్రత్యేకాధికారి భిక్షపతి తెలిపారు. కేతకీ ఆలయానికి వచ్చే భక్తులు దుర్వాసనతో అవస్థలు పడుతున్న విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ లో కంపుకొడుతున్న కేతకీ పరిసరాలు అనే వార్త ప్రచురితమైంది. బుధవారం మండల ప్రత్యేకాధికారి వార్తకు స్పందించి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో ప్రవహిస్తున్న వాలాద్రి వాగులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పరిశీలించారు.
కేతకీ ఆలయ కార్యనిర్వహణ అధికారి శశిధర్ అందుబాటులో లేకపోవడంతో చరవాణిలో సంప్రదించి వాగులో ఉన్న చెత్తాచెదారం తొలిగింపు విషయంపై అడగ్గా, మా పరిధిలోకి రాదని సమాధానమిస్తూ దాటవేశారని భిక్షపతి తెలిపారు. దీంతో ప్రత్యేకాధికారి చొరవ తీసుకొని జేసీబీ సాయంతో చెత్తను తొలిగించారు. దీంతో భక్తులు, వ్యాపారులు, కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం చుట్టుపక్కల ఉన్న కాలనీల్లో పర్యటించి తాగునీరు, పారిశుధ్యం తదితర సమస్యలు అడిగి తెసుసుకున్నారు.