చేర్యాల, మార్చి 7: కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన పెద్దపట్నం కార్యక్రమాన్ని ఆలయవర్గాలు శుక్రవారం వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి చేర్యాల, కొమురవెల్లి, సిద్దిపేట, జనగామ, వరంగల్, కరీంనగర్, గజ్వేల్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు వస్తారు. ఆలయ ఈవో బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆలయ తోటబావి ప్రాంతంలోని మల్లికార్జున స్వామి కల్యాణ వేదిక ముందు భాగంలో శుక్రవారం అర్ధరాత్రి అనంతరం ఒగ్గు పూజారులు పెద్దపట్నం నిర్వహిస్తారు. 8 వారాల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆలయవర్గాలు మల్లన్న కల్యాణోత్సవం, పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాలను నిష్ట, భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. శుక్రవారం రాత్రి భక్తులు మల్లన్న క్షేత్రానికి చేరుకుని పట్నం వేసే కార్యక్రమాన్ని కనులారా వీక్షించి వేకువజామున వెళ్లిపోతారు. భక్తుల సౌకర్యార్థం మల్లన్న కల్యాణ వేదిక వద్ద ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్స్, గ్యాలరీలు ఏర్పాటు చేశారు..
ఒగ్గు పూజారులు పట్నం వద్ద జానపద రీతిన పాటలు పాడుతూ స్వామి వారి కల్యాణోత్సవాన్ని నిర్వహించే కార్యక్రమమే పెద్దపట్నం. మహా శివరాత్రి పర్వదినం రోజున లింగోద్భవకాలం రాత్రి 12గంటలకు మల్లికార్జున స్వామికి అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయ అర్చకులు రాజగోపురం, రాతిగీరలు తదితర ప్రాంతాల్లో ఊరేగించి ఆలయంలోకి తీసుకుపోతారు.ప్రత్యేక పూజల అనంతరం రాత్రి 2గంటల సమయంలో ఒగ్గు పూజారులు పంచ రంగులతో పట్నం వేస్తారు. పట్నం తయారు అనంతరం మల్లికార్జున స్వామి ఉత్సవ విగ్రహాలను పట్నం వద్దకు ఆలయ అర్చకులు తీసుకువచ్చి పూజలు నిర్వహించి ప్రదక్షిణలు చేసి గర్భాలయంలోకి తీసుకుపోతారు. భక్తులు పెద్దపట్నం దాటి స్వామి వారిని దర్శనం చేసుకుని వెళ్లిపోతారు. జనగామ, సిద్దిపేట ఆర్టీసీ డిపోల నుంచి కొమురవెల్లికి ప్రత్యేకంగా బస్సులు నడుపుతారు.