నారాయణఖేడ్, అక్టోబర్ 29 : స్వరాష్ట్రంలో నారాయణఖేడ్ దశ మారుతున్నది. అన్నిరంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నది. పెద్దగా సాగునీటి వనరులు లేని నారాయణఖేడ్ నియోజకవర్గంలోని రైతులు అత్యధికంగా వర్షాధార పంటలను నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారు. సారవంతమైన భూములు ఉన్నప్పటికీ భూగర్భజలాల కొరత రైతులకు శాపంగా మారింది. ప్రభుత్వం సాగునీటి కల్పనపై దృష్టిసారించి ఏకంగా రూ.1947 కోట్లు వెచ్చించడం విశేషం. బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసిన ప్రభుత్వం నియోజకవర్గంలోని 1.31 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో రూ.1774 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. ఇప్పటికే ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి చేతుల మీదుగా 51 మంది భూ నిర్వాసితులకు పరిహారం అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టుకు తరలించి బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన ఈ పథకం సాగునీటి కోసం తరతరాలుగా పరితపించిన ఇక్కడి రైతాంగానికి వరప్రదాయినిగా మారనున్నది. నారాయణఖేడ్, నాగల్గిద్ద, మనూరు, కంగ్టి మండలాల్లో కొత్తగా ఎనిమిది చెరువుల నిర్మాణానికి రూ.69 కోట్లు, రూ.25.75 కోట్లతో నల్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ, రూ.7.19 కోట్లతో నాలుగు ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ వంటి చర్యలు నీటిపారుదలకు ఊతమిస్తున్నాయని చెప్పవచ్చు. మిషన్ కాకతీయ ద్వారా రూ.71 కోట్లతో నియోజకవర్గంలో 288 చెరువులు పునరుద్ధరించారు.
గతంలో నిత్యం తాగునీటి సమస్యతో అల్లాడిన నారాయణఖేడ్ నియోజకవర్గానికి మిషన్ భగీరథ రూపంలో శాశ్వత పరిష్కారం లభించింది. తండాలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా ద్వారా నీటి సరఫరా నిరాటంకంగా జరుగుతున్నది. ఇందుకోసం ప్రభుత్వం రూ.308 కోట్లు వెచ్చించింది. నియోజకవర్గంలోని 217 పంచాయతీల పరిధిలోని 372 ఆవాసాలకు నీటి సరఫరా జరుగుతున్నది. మంజీర పరీవాహక ప్రాంతమైన రేగోడ్ మండలం తాటిపల్లి వద్ద 350 కిలోలీటర్ల భారీ ట్యాంకు నుంచి 530 కిలోమీటర్ల పైప్లైన్ ద్వారా వంద శాతం ఆవాస ప్రాంతాలకు నీరు సరఫరా అవుతున్నాయి. నీటి సరఫరాను మరిన్ని ఆవాస ప్రాంతాలకు విస్తరించేందుకు ఇటీవల మరో రూ.9.85 కోట్లు మంజూరయ్యాయి. గతంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో నీటి ఎద్దడితో ప్రజలు పడే ఇక్కట్లు రోజుల తరబడి పతాక శీర్షికల్లో కనిపించేవి. ఇక్కడి పరిస్థితి ఎంతో తీవ్రంగా ఉండేది. అలాంటి దుస్థితి నుంచి ప్రజలను గట్టెక్కించింది మిషన్ భగీరథ పథకం.
అన్ని గ్రామాలకు రోడ్లను మెరుగు పర్చడంతో పాటు మండల కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్లు, అవసరమైన చోట హైలెవల్ బ్రిడ్జీల నిర్మాణం చేపట్టారు. రూ.367.5 కోట్లతో రవాణా సదుపాయాన్ని మెరుగుపర్చగా, ఇందులో సింహభాగం తండాలకు బీటీరోడ్ల ఏర్పాటుకు కేటాయించారు. 210 తండాలు ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒక్క తండాల రోడ్ల అభివృద్ధికే ఏకంగా రూ.112 కోట్లు వెచ్చించి 80శాతం తండాలకు రవాణా సౌకర్యం కల్పించారు. మిగతా తండాల పనులు ప్రారంభించాల్సి ఉంది. రూ.57 కోట్లతో నారాయణఖేడ్- దెగుల్వాడి డబుల్ లేన్ రోడ్డు, రూ.22 కోట్లతో నారాయణఖేడ్- కరస్గుత్తి డబుల్ లేన్ రోడ్డు, రూ.10 కోట్లతో నారాయణఖేడ్-రాయిపల్లి డబుల్ లేన్ రోడ్డు, రూ.18 కోట్లతో నిజాంపేట్ నుంచి మునిగేపల్లి, నాగధర్ మీదుగా మార్డి క్రాస్రోడ్డు వరకు ఏర్పాటు చేశారు. నారాయణఖేడ్ నుంచి సిర్గాపూర్ మీదుగా మాసాన్పల్లి వరకు డబుల్ లేన్ రోడ్డు ఏర్పాటుకు రూ.15 కోట్లు మంజూరయ్యాయి. నియోజకవర్గంలోని బీటీ రోడ్ల అభివృద్ధికి గడిచిన ఎనిమిదేండ్లలో రూ.95.5 కోట్లు వెచ్చించగా, రూ.38 కోట్లతో అవసరమైన చోట హైలెవెల్ బ్రిడ్జీల నిర్మాణం చేపట్టారు. ఊరు పుట్టినప్పటి నుంచి రోడ్డు సౌకర్యానికి నోచుకోని నాగల్గిద్ద మండలంలోని ఎర్రబొగుడ వంటి గ్రామాలెన్నో బీటీ రోడ్లుతో మెరిసిపోతున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.41.10 కోట్లతో వైద్య సదుపాయాలను మెరుగుపర్చింది. నారాయణఖేడ్లో గతంలో 30 పడకలకు పరిమితమైన ఏరి యా దవాఖానను ఏకంగా వంద పడకలకు విస్తరించడంతో పాటు రూ.7.50 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించింది. సుఖ ప్రసవాలు చేయడంతో పాటు నవజాత శిశువుల కోసం నారాయణఖేడ్లో రూ.11 కోట్లతో నిర్మించిన మాతాశిశు దవాఖాన ఇక్కడి ప్రజలకు ఎంతో ఉపకరిస్తున్నది. మండల కేంద్రాలైన కల్హేర్, కరస్గుత్తి పీహెచ్సీలను 30 పడకలకు విస్తరించడంతో పాటు రూ.12.80 కోట్ల నిధులతో నూతన భవనాలను నిర్మించింది. నిజాంపేట్, సిర్గాపూర్ పీహెచ్సీలకు నూతన భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ.3.12 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. నారాయణఖేడ్ ఏరియా దవాఖానలో రూ. కోటి నిధులతో డయాలసిస్ సెంటర్, రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. రూ. కోటి నిధులతో ఆక్సిజన్ ప్లాంట్ను అందుబాటులోకి తెచ్చారు. రూ.2.60 కోట్ల నిధులతో నియోజకవర్గంలో 13 ఆరోగ్య ఉపకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉచితంగా 56 రకాల పరీక్షలు చేసేందుకు అనువుగా త్వరలో నారాయణఖేడ్లో రూ.2 కోట్ల నిధులతో టీ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నారాయణఖేడ్ నియోజకవర్గం ఇప్పుడు విద్యాపరంగా ముందుకు సాగుతోంది. దీనికోసం ప్రభుత్వం రూ.70 కోట్లు వెచ్చించింది. నియోజకవర్గంలో ఏకంగా ఎనిమిది గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది. వాటిలో నాలుగు ఎస్టీ, రెండు మైనార్టీ, రెండు బీసీ గురుకులాలు ఉన్నాయి. నారాయణఖేడ్, కంగ్టి, సిర్గాపూర్, కరస్గుత్తిలలో ఎస్టీ గురుకుల విద్యాలయాలకు సొంత భవనాలను నిర్మించగా, ఒక్కో భవనానికి రూ.5.50 కోట్ల చొప్పున రూ.22 కోట్లు వెచ్చించింది. సాంఘిక సంక్షేమ గురుకుల భవనం శిథిలావస్థకు చేరగా, రూ.13 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో నిర్మించిన నూతన భవనం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. కొత్తగా మనూరులో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయడంతో పాటు కంగ్టి, కల్హేర్ జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు, ఫర్నిచర్ తదితర సదుపాయాలు కల్పించి విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.34 కోట్లు మంజూరయ్యాయి. నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.కోటి నిధులతో గ్రంథాలయ భవన నిర్మాణం చేపట్టారు.
నారాయణఖేడ్ మున్సిపాలిటీ సహా నియోజకవర్గంలోని ఆయా అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం రూ.215 కోట్ల నిధులు వెచ్చించింది. రూ.13 కోట్లు వెచ్చించి నారాయణఖేడ్లో మార్కెట్ యార్డు, పెద్దశంకరంపేటలో సబ్మార్కెట్యార్డు ఏర్పాటు చేసింది. కంగ్టి, కల్హేర్, మనూరులలో గోదాములను నిర్మించింది. రూ.27 కోట్లతో మరో 17 సబ్స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఫరాకు చర్యలు తీసుకున్నది.
నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.3 వేల కోట్లకు పైగా నిధులు వెచ్చించా రు. నియోజకవర్గం అన్ని రంగాల్లో ఊహించని రీతిలో అభివృద్ధి చెం దుతున్నది. సమైక్య రాష్ట్రంలో మా ప్రాం తంపై చూపిన వివక్ష కారణంగా వెనుకబాటుకు గురైన మాట వాస్తవం. సీఎం కేసీఆర్ నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని ఇతర ప్రాంతాలతో సమాంతరంగా అభివృద్ధి చేయాలనే చొరవతో అడిగింది కాదనకుండా నిధులు మంజూరు చేయడంతో పురోగతి సాధించాం. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మరోసారి ప్రజల ముందుకు వచ్చా. నియోజకవర్గాన్ని సస్యశ్యామ లం చేసే బసవేశ్వర ఎత్తిపోతలు పూర్తి కావాలంటే సీఎం కేసీఆర్కు పట్టం కట్టడంతో పాటు నారాయణఖేడ్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాల్సిన అవసరం ఉంది.