వెల్దుర్తి : కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress ) రైతులపై కపట ప్రేమ చూపిస్తుందని, ప్రభుత్వ నిర్లక్ష్యమే ధాన్యం కొనుగోళ్ల జాప్యానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ( MLA Sunitha Laxma Reddy ) మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు జాప్యం కారణంగా కొనుగోలు కేంద్రాలలో రైతులు పడుతున్న ఇబ్బందులు, అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తిన వైనంపై ఆమె గురువారం మండల కేంద్రమైన వెల్దుర్తి లోని కుకునూరు చౌరస్తా వద్ద రైతు పక్షాన నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు తమ ఇబ్బందులను ఏ కరువు పెట్టారు కోతలు కోసి ధాన్యం తెచ్చి నెలన్నరకు పైగా అవుతుందని, ఇప్పటికీ గింజ కూడా కొనుగోలు చేయలేదని ఆరోపించారు. తూకం వేసిన ధాన్యం కూడా తరలించడంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని, వాహనాలు రావడం లేదంటూ ధాన్యం బస్తాలను కేంద్రాలలోనే నిలువ చేస్తున్నారని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని దొంగల రాజ్యం వచ్చిందని, ఒక రోజు దొంగ అయితే పట్టుకోవచ్చని కానీ తాము రోజు దొంగలపాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనకపోతే తాము బ్యాంకు రుణాలు కానీ, ఇంటి బిల్లులు గాని, ప్రభుత్వ సంబంధించిన ఏ బిల్లులు కూడా తాము చెల్లించబోమని అన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ రెండు పంటలకే రైతుబంధు ఇస్తున్నారని, తాము మూడు పంటలకు ఇస్తామని, రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీలిచ్చిన కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచిందన్నారు. ధాన్యం కొనుగోళ్లను తప్పించుకునేందుకు హామాలీలు లేరని, లారీలు రావడంలేదని, రైస్ మిల్లలు ధాన్యం తీసుకోవడం లేదని చిన్నచిన్న కారణాలు చెబుతున్నారని ఆరోపించారు.
ధాన్యం కొనుగోలు చేసే ముందు సాధారణ ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బేషరతుగా తడిచిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యం, రంగు మారిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసి, రైతులకు మద్దతు ధర అందించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.