తూప్రాన్, మే 1: ఓ ప్రైవేటు కళాశాల నిర్లక్ష్యం కారణంగా రెండు గంటల పాటు డిగ్రీ పరీక్షలు ఆలస్యమైన ఘటన తూప్రాన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తూప్రాన్ పట్టణంలోని నలంద డిగ్రీ కళాశాలలో ఎగ్జామినేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. గత నెల 10న డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు నలంద డిగ్రీ కళాశాలలో ప్రారంభమయ్యాయి. ఈనెల 7న చివరి పరీక్ష ఉండగా బీఎస్సీ కంప్యూటర్స్ ఫస్ట్ సెమిస్టర్ గురువారం ఉదయం 9.30 గంటల నుండి 12.30 గంటల వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ గురువారం ఉదయం పరీక్ష ప్రారంభమయ్యే సమయం అయిపోయేటప్పటికి కూడా కళాశాల యాజమాన్యం, సిబ్బంది కళాశాలకు రాలేదు.
కళాశాలకు తాళాలు వేసి ఉండటంతో పరీక్ష రాయడానికి వచ్చిన నలుగురు విద్యార్థులు అవాక్కయ్యారు. విషయాన్ని తూప్రాన్ తహసీల్దార్ విజయలక్ష్మి దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లగా కళాశాల యాజమాన్యం, సిబ్బంది స్పందించకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి ఆదేశాల మేరకు తహసీల్దార్ విజయలక్ష్మి ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆడిట్ వారిని ఫోన్ ద్వారా సంప్రదించారు.
విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు పరీక్షా పత్రాలను ఎగ్జామ్ రూట్ ఆఫీసర్ సమక్షంలో యూనివర్సిటీ లాగిన్ నుండి డౌన్లోడ్ చేసిన ప్రశ్నా పత్రాన్ని ప్రింట్ తీసి విద్యార్థులకు అందజేశారు. దీంతో 11.45 నిమిషాలకు ఫస్ట్ సెమిస్టర్ పరీక్షను ప్రారంభించారు. తూప్రాన్ ఆర్డీవో ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలందా డిగ్రీ కళాశాల యాజమాన్యం, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా తూప్రాన్ పోలీసులకు తహసీల్దార్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.