దుబ్బాక,జూన్10: సిద్దిపేట జిల్లా దుబ్బాక కేసీఆర్ బడిలోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొనసాగించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కేసీఆర్బడిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, సిబ్బందితో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలలకు సంబంధించిన విద్యార్థుల సంఖ్య, తరగతి గదులు, ల్యాబ్ గదుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భవనంలో కింది అంతస్తులో ఒక విభాగంలో పాఠశాల, మరో విభాగంలో జూనియర్ కళాశాల, పైన అంతస్తులో డిగ్రీ కళాశాల కొనసాగించాలని సూచించారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు త్వరగా చేపట్టాలని మున్సిపల్, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
2026-27 డిగ్రీ విద్యార్థుల అడ్మిషన్లు కేసీఆర్ బడిలోనే స్వీకరించాలని ప్రిన్సిపాల్ భవానీకి ఎమ్మెల్యే సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ చదువుకున్నందున పాఠశాలపై మమకారంతో రూ.15 కోట్లతో సకల హంగులతో బడి నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సంగీతారవీందర్, మున్సిపల్ కమిషనర్ మహేశ్, బీఆర్ఎస్ నాయకులు రవీందర్రెడ్డి , కిషన్రెడ్డి, ఎల్లారెడ్డి, రాజమౌళి, భూంరెడ్డి, కైలాశ్ పాల్గొన్నారు.
దుబ్బాకలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనంతో పాటు గోదాంల నిర్మాణాలకు ప్రభుత్వ అసైన్డ్ భూములు సేకరించాలని తహసీల్దార్కు ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి సూచించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం సుమారు 20 ఎకరాల స్థలం, గోదాంల నిర్మాణాల కోసం అసైన్డ భూములు సేకరించాలన్నారు. దుబ్బా క, అక్బర్పేట-భూంపల్లి, మిరుదొడ్డి మండలాల తహసీల్దార్లతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలో చేర్వాపూర్, ధర్మాజీపేట శివారులో అసైన్డ్ భూములు గుర్తించి స్వాధీనం చేసుకోవాలని సూచించారు. చీకోడు, మోతె గ్రామాల్లో అసైన్డ్ భూముల వివరాలు, వాటికి సంబంధించిన రికార్డులు అందించాలన్నారు. అనంతరం దుబ్బాక పట్టణంలో రజినీకాంత్రెడ్డి స్కూల్లో నూతనంగా నిర్మించిన వసతిగృహం భవనాన్ని ఆయన ప్రారంభించారు.