భవిష్యత్తులో అన్ని రాష్ర్టాల్లో అమలవుతుంది
సీఎం కేసీఆర్తోనే అణగారిన వర్గాల అభివృద్ధి
కాంగ్రెస్, బీజేపీలకు దళితులంటే చిన్నచూపు
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
నర్సాపూర్లో లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ
సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచన
హాజరైన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి,
ఎమ్మెల్యే మదన్రెడ్డి
దళితులను సంపన్నులను చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో హామీ ఇవ్వనప్పటికీ సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్, శివంపేట్, మాసాయిపేట, కౌడిపల్లి మండలాలకు చెందిన 39 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మదన్రెడ్డి,రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితబంధు దేశానికి ఆదర్శంగా మారిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్లకు దళితుల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు. మదన్రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.10 లక్షలతో స్వేచ్ఛగా నచ్చిన వ్యాపారం చేసుకునే గొప్ప పథకమని, లబ్ధిదారులు యూనిట్లను సద్వినియోగపరుచుకోవాలని కోరారు.
నర్సాపూర్, మే16: తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు భవిష్యత్తులో ఆదర్శంగా తీసుకొని వారి రాష్ర్టాల్లో ప్రవేశపెడతారని ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్లో షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నర్సాపూర్, శివ్వంపేట, మాసాయిపేట, కౌడిపల్లి మండలాలకు చెందిన నాలుగు గ్రామాల లబ్ధిదారులకు దళితబంధు పథకం యూనిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై 36 మంది లబ్ధిదారులకు ఫోర్వీలర్ వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్తప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ దళితులను సంపన్నులను చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ పథకం దేశమంతటా తెలిసిందని వెల్లడించారు. బీజేపీ నాయకుడు మాకు అవకాశం ఇవ్వండి ప్లీజ్ప్లీజ్ అని అడుగుతున్నాడని, తెలంగాణ ప్రజలు అమాయకులు కారని, అభివృద్ధిని చూసే వారికి పట్టం కడతారని తెలిపారు. ఇతర పార్టీల నాయకులు దళితుల కోసం ఎన్నికల్లో ఎన్నో వాగ్ధానాలు చేశారని, గెలవగానే వాగ్ధానాలను గాలికి వదిలేశారని గుర్తుచేశారు. దేశంలోని 28 మంది సీఎంలకు దళితులపై సోయి లేదని కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ అడగకుండానే దళితబంధును తీసుకువచ్చారన్నారు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు పెద్ద సభలు పెడుతున్నారే కానీ, ఏ ఒక్కరైనా దళితుల గురించి ప్రస్థావిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు పథకం అందేలా కృషి చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆరోగ్యం బాగా లేకున్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అభినందించారు.
సద్వినియోగపరుచుకొని పైకి రావాలి
– నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి
దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగపరుచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి సూచించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అతి తక్కువ కాలంలోనే సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికి మార్గదర్శకంగా నిలిపాడన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్, రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు అందిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా సాగు, తాగునీటికి ఇబ్బంది తీరిందని వెల్లడించారు. దలితబంధు ద్వారా లబ్ధి పొందుతున్న వారు యూనిట్స్ను సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ఈయూనిట్ల ద్వారా భవిష్యత్తులో మంచి ఫలితాలు చూస్తారన్నారు. అనంతరం దళితులతో సహపంక్తి భోజనం చేసి, లబ్ధిదారులకు వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు, మినీ వ్యాన్లు, ఆటోలు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ప్రత్యేకాధికారి నర్సయ్య, ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఆర్డీవో ఉపేందర్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనసూయఅశోక్గౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, మున్సిపల్ వైస్చైర్మన్ నయీమొద్దీన్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మన్సూర్, ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అశోక్గౌడ్, శ్రీధర్గుప్తా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, కౌన్సిలర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
అంబేద్కర్ స్ఫూర్తితో దళితులకు ప్రత్యేక పథకం
– రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి
డా.బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నత కోసం దళితబంధు పథకాన్ని తీసుకువచ్చారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. దేశంలో అన్ని పథకాల్లో ఈ పథకం శ్రేష్టమైనదని, ఎలాంటి పూచీకత్తు లేకుండా పూర్తిగా ఉచితంగా లబ్ధిదారులు స్వేచ్ఛగా ఎన్నుకున్న యూనిట్లకు రూ.10 లక్షలు ఇస్తున్న పథకమన్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో అర్హులైన లబ్ధిదారులకు దళిత బంధు అమలు
చేయడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.